సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి
ABN , Publish Date - Jul 01 , 2025 | 12:06 AM
సీతం పేట ఐటీడీఏ కార్యాలయంలో పీవో సి.యశ్వంత్ కుమార్రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు గిరిజనుల నుంచి 72 వినతులు వచ్చాయి.
పార్వతీపురం, జూన్ 30, (ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులకు ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జేసీ ఎస్ఎస్ శోభిక, ఐటీడీఏ పీవో అశుతోష్ శ్రీవాత్సవ, డీఆర్వో కె.హేమలత, డీఆర్డీఏ పీడీ సుధారాణితో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించా రు. సాలూరు మండలం బంగారమ్మపేట గ్రామా నికి చెందిన ఎ.సూర్యనారాయణకు, సీతానగరం మండలం ఇప్పలవలస గ్రామానికి చెందిన పి.కు మారస్వామికి చెవిటి మిషన్ను అందించారు. మొత్తం 112 అర్జీలు అందాయని తెలిపారు. సీతం పేట మండలం అంటికొండ, పెద్దగోడ గ్రామాల్లో అదనపు పాఠశాల భవనాలు మంజూరు చెయ్యాలని ఆయా గ్రామస్థులు అర్జీ అందించారు. గరుగుబిల్లి మండలం రావివలస ఎంపీపీ స్కూల్ను బేసిక్ ప్రైమరీ స్కూల్గా కొనసాగించాలని బి.తిరుపతిరావు కోరారు. పాచిపెంట మండలం కేరంగి గ్రామానికి విద్యుత్ స్తంభాలు మంజూరు చేయాలని సర్పంచ్ లచ్చయ్య దరఖాస్తు అందించారు. ఇలా అనే సమస్యలపై ఫిర్యా దులు అందాయి. డ్వామా పీడీ కె.రామచంద్రరావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సచివాలయ కార్యదర్శుల వినతి
గ్రామ సచివాలయ కార్యదర్శులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ గ్రీవెన్స్లో వినతిప త్రం అందజేశారు. తాము ఎదుర్కొంటున్నా సమస్యల ను కలెక్టర్కు వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందించి కమిషనర్కు లేఖ రాస్తామని హామీనిచ్చారు.
ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 72 వినతులు
సీతంపేట రూరల్, జూన్ 30(ఆంధ్రజ్యోతి): సీతం పేట ఐటీడీఏ కార్యాలయంలో పీవో సి.యశ్వంత్ కుమార్రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు గిరిజనుల నుంచి 72 వినతులు వచ్చాయి. చొర్లంగి పీహెచ్సీ పరిధిలో సీహెచ్వో పోస్టు ఇప్పించాలని కోడూరుకు చెందిన ఆరిక నీలవేణి కోరింది. నాడు-నేడు పథకం కింద గతంలో చేపట్టిన నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లు మంజూరు చేయాలని ఆడంగి గాయత్రీ అనే మహిళ పీవోను కోరారు. తల్లికి వందన పథకం వర్తింపచేయాలని సవర మల్లమ్మ కోరగా నల్లరాయి గూడ గ్రామంలో మంచినీటి సౌకర్యం కల్పించాలని ఆరిక సురేష్ కోరారు. ఇలా అనేక సమస్యల పరిష్కా రం కోరుతూ పీజీఆర్ఎస్ను గిరిజనులు ఆశ్రయిం చారు. పీవోతో పాటు ఏపీవో జి.చిన్నబాబు, డీడీ అన్న దొర, టీడబ్ల్యూ ఈఈ పీవీఎస్ఎన్ కుమార్, వెలుగు ఏపీడీ సన్యాసిరావు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ మధుసూదన రావు, ఏవో వాహిణి, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీడీ శ్రీహరి, పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
నా కుమారుడిని ఆదుకోండి
తమ కుమారుడు పుట్టుకతో దివ్యాంగుడని, పింఛన్ మంజూరు చేయించి ఆదుకోవాలని నారాయణగూడ గ్రామానికి చెందిన గిరిజన తల్లిదండ్రులు సవర కూర్మారావు, లలితలు.. పీవో యశ్వంత్కుమార్రెడ్డిని కోరారు. ఈ మేరకు సోమవారం తమ కొడుకు అభిని ఎత్తుకుని గ్రీవెన్స్కు వచ్చారు. తన కుమారుడికి 11ఏళ్లు వచ్చినా తన పని తాను చేసుకోలేని స్థితిలో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఫించన్ మంజూరు చేయాలని వేడుకున్నారు. దీనిపై పీవో స్పందించి ఎంపీడీవో బీబీ మిశ్రోతో ఫోన్లో మాట్లాడి, దివ్యాంగుడికి ఫించన్ మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు
బెలగాం, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): ఫిర్యాదుల పరి ష్కారంలో అలసత్వం లేకుండా నిర్ధేశించిన సమయం లో సమస్యలు పరిష్కరించాలని ఎస్పీ ఎస్వీ మాధవ రెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ నిర్వహించారు. పీజీఆర్ఎస్లో 11 ఫిర్యాదులు అందిన ట్టు ఎస్పీ తెలిపారు. బాధితులు ఇచ్చిన వినతిపత్రాల ను పరిశీలించారు. నిర్ధిష్ట సమయంలో ఫిర్యాదులు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. డీసీఆర్బీ సీఐ ఆదాం, సిబ్బంది పాల్గొన్నారు.