సీజన్ ముగుస్తున్నా ధర పెరగలే
ABN , Publish Date - Jul 13 , 2025 | 11:38 PM
సీతంపేట ఏజెన్సీలో పైనాపిల్ సీజన్ ఈవారంతో ముగియనుంది. ఇకపై ఆశించిన స్థాయిలో పైనాపిల్ పంట దిగుబడి ఉండదు.
పది రూపాయలే పలుకుతున్న పైనాపిల్
నిరాశలో గిరిజనులు
సీతంపేట రూరల్, జూలై 13 (ఆంధ్రజ్యోతి):సీతంపేట ఏజెన్సీలో పైనాపిల్ సీజన్ ఈవారంతో ముగియనుంది. ఇకపై ఆశించిన స్థాయిలో పైనాపిల్ పంట దిగుబడి ఉండదు. అయితే, సీజన్ ముగుస్తున్నప్పటికీ పైనాపిల్ పంటకు సరైన మద్దతు ధర లభించడం లేదు. గత వారం ఒక్కో పైనాపిల్ పండు ధర రూ.10వరకు పలికింది. ఈ వారం కూడా ధరలో ఎటువంటి మార్పు లేకపోవడంతో గిరిజన రైతులు తీవ్ర నిరాశ చెందారు. ఆదివారం సీతంపేట వారపుసంతకు పైనాపిల్ పంట ఎక్కువగానే వచ్చినప్పటికీ ధరలో మాత్రం ఎటువంటి మార్పులు కనబడలేదు. దీంతో గిరిజన రైతులు లబోదిబోమంటున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పైనాపిల్ పంటకు గిట్టుబాటు ధర రాక నష్టపోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.