అవగాహనతోనే మలేరియా నివారణ
ABN , Publish Date - Apr 26 , 2025 | 12:11 AM
అవగాహనతోనే మలేరియాను నివారించవచ్చునని, ఇందులో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు అన్నారు.
- డీఎంహెచ్వో భాస్కరరావు
పార్వతీపురం, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): అవగాహనతోనే మలేరియాను నివారించవచ్చునని, ఇందులో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు అన్నారు. ప్రపంచ మలేరియా నివారణ దినం సందర్భంగా శుక్రవారం పార్వతీపురంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్జీవో హోం సమావేశ మందిరంలో నిర్వహించిన అవగాహన సదస్సులో డీఎంహెచ్వో మాట్లాడారు. ‘మన పరిసరాల్లో నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో దోమల లార్వా పెరుగుతుంది. నీటి నిల్వలు లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఫ్రైడే డ్రైడే ప్రతి ఒక్కరూ పాటించాలి. జిల్లాలో మలేరియా ప్రభావిత గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. దోమల నివారణ చర్యల్లో భాగంగా 915 గ్రామాల్లో మే ఒకటో తేదీ నుంచి ఐఆర్ఎస్ స్ర్పేయింగ్ ఇంటింటికీ చేయిస్తాం. జూలై 1 నుంచి రెండో విడత పిచికారీ చేయిస్తాం. ఏఎల్వో పిచికారీ, ఫోకల్ స్ర్పేయింగ్, ఫాగింగ్ను మలేరియా గుర్తించిన ప్రాంతాల్లో చేయిస్తాం. జిల్లా వ్యాప్తంగా ప్రపంచ మలేరియా నివారణ దినం అన్ని ఆరోగ్య కేంద్రాల పరిధిలో నిర్వహించాం. వివిధ శాఖల సమన్వయంతో ప్రజల్లో అవగాహన పెంపొందించి జిల్లాలో మలేరియా నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రో గ్రాం అధికారులు డాక్టర్ టి.జగన్మోహన్రావు, పీఎల్.రఘుకుమార్, ఏఎంవో డి.సూర్యనారాయణ, వైద్యాధికారి రవిచంద్ర, క్వాలిటీ కన్సల్టెంట్లు డాక్టర్ రమణ, డాక్టర్ మణికంఠ, ఎన్జీవో అధ్యక్షుడు కిషోర్, డెమో సన్యాసిరావు, సబ్ యూనిట్ అధికారి ధనుంజయ్కుమార్ పాల్గొన్నారు.