వృద్ధిరేటు పెరిగేలా ప్రణాళికలు
ABN , Publish Date - Jun 26 , 2025 | 11:46 PM
వ్యవసాయం, అనుబంధ రంగాలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లో వృద్ధి రేటు గణనీయంగా పెరిగేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
- కలెక్టర్ శ్యామ్ప్రసాద్
పార్వతీపురం, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయం, అనుబంధ రంగాలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లో వృద్ధి రేటు గణనీయంగా పెరిగేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సుపరిపాలన కార్యక్రమం నేపథ్యంలో కలెక్టరేట్లో అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో నిర్దేశించిన లక్ష్య సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రతి ఏటా 15 శాతం కంటే ఎక్కువ వృద్ధి రేటు సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా వ్యవసాయం, తృణధాన్యాల సాగు, డ్రోన్ల వినియోగం, ఆధునిక వ్యవసాయ సాగుతో రైతులు అధిక ఆదాయం పొందాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రణాళిక, వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, అటవీ, పశుసంవర్ధక, వైద్య ఆరోగ్య, ఇంటర్మీడియట్ వైద్యశాఖ అధికారులు పీవీ రాజు, కె.రాబర్ట్పాల్, వై.క్రాంతికుమార్, వై.శ్రీదేవి, ప్రసూన, మన్మథరావు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రవేశాలు మరింత పెరగాలి
గిరిజన సంక్షేమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు మరింత పెరగాలని కలెక్టర్ శ్యామ్ప్రసాద్ ఉపాధ్యాయులను ఆదేశించారు. కొమరాడ మండలం అంకుళ్లవలస, రావికర్రవలస గిరిజన సంక్షేమ ప్రాథ మిక పాఠశాలలను ఐటీడీఏ పీవో శ్రీవాత్సవతో కలిసి కలెక్టర్ గురువారం పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సామర్థ్యాలను తెలుసుకున్నారు. పాఠశాలలో పరిశుభ్రత పాటించాలని, కిచెన్ గార్డెన్ నిర్వహించాలని అన్నా రు. విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన విద్యను అందించాలని కలెక్టర్ సూచించారు.