Pedapolamamba చదురుగుడికి పెదపోలమాంబ
ABN , Publish Date - Dec 30 , 2025 | 12:09 AM
Pedapolamamba to Chadurugudi ఉత్తరాంధ్రుల ఇలవేల్పు.. భక్తుల కొంగుబంగారం శంబర పోలమాంబ అమ్మవారి జాతరలో తొలి ఘట్టానికి సోమవారం శ్రీకారం చుట్టారు. ఈ మేరకు పెదపోలమాంబ అమ్మవారిని చదురుగుడిలోకి తెచ్చారు.
మక్కువ రూరల్, డిసెంబరు29(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల ఇలవేల్పు.. భక్తుల కొంగుబంగారం శంబర పోలమాంబ అమ్మవారి జాతరలో తొలి ఘట్టానికి సోమవారం శ్రీకారం చుట్టారు. ఈ మేరకు పెదపోలమాంబ అమ్మవారిని చదురుగుడిలోకి తెచ్చారు. తొలుత ధర్మకర్తల మండలి సభ్యులు, గ్రామపెద్దలు, భక్తులు సీబిల్లిపెద్దవలస గ్రామరహదారిలో ఉన్న పెద పొలమాంబ దేవాలయానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అమ్మవారిని ఊరేగింపుగా శంబర గ్రామానికి తీసుకొచ్చారు. మేళతాళాలు, తప్పిటగుళ్లు ప్రదర్శన, భజనలు, మహిళల కోలాటం, చిన్నారులు, పెద్దల డ్యాన్స్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పెదపొలమ్మ గ్రామంలోకి రాగానే మహిళలు పెద్దఎత్తున చేరుకుని కుంకమ పూజలు చేశారు. మరోవైపు గ్రామస్థులు, యువత బాణసంచా కాల్చి సందడి చేశారు. జనవరి 5,6,7 తేదీల్లో పెదపోలమాంబ పండగను సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. చివరిరోజున పోలమాంబ అమ్మవారిని గద్దె నుంచి గ్రామంలోకి తీసుకొస్తారు. ఇక జనవరి 26 నుంచి 28 వరకు పోలమాంబ జాతర నిర్వహిస్తారు. కాగా ప్రస్తుతం శంబరలో పండగ వాతావరణం మొదలైంది. ధర్మకర్తల మండలి చైర్మన్ నైదాన చినతిరుపతి, పోలమాంబ దేవాలయం ఈవో శ్రీనివాసరావు , మక్కువ ఎస్ఐ ఎం.వెంకటరమణ , ఎంపీటీసీ తీళ్లపోలినాయుడు, ఉపసర్పంచ్ అల్లు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.