గురవాం యువకుడిపై పీడీ యాక్ట్
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:19 AM
రాజాం మండలం గురవాం గ్రామానికి చెందిన కుప్పిలి నవీన్ను నివారణ నిర్భంధ చట్టం (పీడీ యాక్ట్) కింద నిర్బంధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
రాజాం రూరల్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాజాం మండలం గురవాం గ్రామానికి చెందిన కుప్పిలి నవీన్ను నివారణ నిర్భంధ చట్టం (పీడీ యాక్ట్) కింద నిర్బంధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్ అంబేడ్కర్ జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం ఆమోదించింది. కుప్పిలి నవీన్ ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తూ చిన్న చిన్న విషయాలకే గొడవలకు దిగుతూ... హాని కలిగించడం, శారీరక దాడులకు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడుతున్న విషయమై రాజాం టౌన్ సి.ఐ. అశోక్కుమార్... కలెక్టర్, ఎస్పీలకు నివేదించారు. సంఘ విద్రోహక శక్తిగా ప్రజల మనసుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాడని, శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నాడని కలెక్టర్కు నివేదించారు. దీంతో స్పందించిన కలెక్టర్ అంబేడ్కర్ కుప్పిలి నవీన్ వ్యవహారశైలిని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. నవీన్పై హత్యాయత్నం కేసులో సాక్షులు ఉన్నప్పటికీ భయంతో ముందుకు రావడం లేదని అధికార యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించారు. దీంతో ప్రివెన్సివ్ ఆఫ్ డేంజరస్ యాక్టవిటీస్ యాక్ట్ 1986 ప్రకారం ప్రభుత్వం నవీన్ను గూండాగా గుర్తించింది. ఈ చట్టం కింద నవీన్ను నిర్బంధించడానికి తగు కారణాలున్నాయని అడ్వైజరీ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదిందించింది. పౌర చట్టాలు, నవీన్ నేరపూరిత కార్యకలాపాలను అరికట్టలేకపోయామని ప్రభుత్వం సంతృప్తి చెంది పీడీ యాక్ట్కు అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే విషయాన్ని రాజాం టౌన్ సి.ఐ. అశోక్కుమార్ వద్ద ప్రస్తావించగా వాస్తవమేనని నిర్ధారించారు.