సాగు భూములకు పట్టాలు ఇవ్వాలి
ABN , Publish Date - Jun 24 , 2025 | 12:09 AM
గిరిజనులు సాగు చేసుకుంటున్న బంజరు, కొండపోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
జియ్యమ్మవలస, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు సాగు చేసుకుంటున్న బంజరు, కొండపోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కూరంగి సీతారాం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎస్ఐ ప్రశాంత్కుమార్ తగు బందోబస్తు ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.
పాచిపెంట: దశాబ్దాల కాలం నుంచి కుడుమూరు, కొండతాడూరు భూముల్లో గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కోరాడ ఈశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద గిరిజన రైతులతో నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ డి.రవికి వినతిపత్రం అందజేశారు. ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
పాలకొండ: గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పోడు పట్టాలు ఇవ్వాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యుడు దూసి దుర్గారావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యా లయం వద్ద ఆదివాసీ గిరిజన సంఘం, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ సూపరింటెండెంట్కు వినతిపత్రం అందించారు. సీఐటీయూ మండల కార్యదర్శి కాద రాము, గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.