Share News

Not Given for the Past Five Months! ఐదు నెలలుగా ఇవ్వట్లే!

ABN , Publish Date - May 09 , 2025 | 11:39 PM

Not Given for the Past Five Months! సీతంపేట ఐటీడీఏ పరిధిలో రేషన్‌కార్డుదారులకు కందిపప్పు అందడం లేదు. గడిచిన ఐదు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇదేమిటని ఎండీయూ వాహనాల ఆపరేటర్‌లను ప్రశ్నిస్తే సప్లయ్‌ నిలిపివేశారని.. తామేం చేస్తామని బదులిస్తున్నారు.

Not Given for the Past Five Months! ఐదు నెలలుగా ఇవ్వట్లే!
ఎండీయూ వాహనం వద్ద నిత్యవసర సరుకుల కోసం పడిగాపులు కాస్తున్న గిరిజనులు

  • బియ్యం, పంచదారతోనే సరి..

  • అవి కూడా ఆలస్యంగానే పంపిణీ

  • మరోవైపు తీవ్రంగా వేధిస్తున్న సిగ్నల్‌ సమస్య

  • ప్రతినెలా రేషన్‌ కార్డుదారులకు తప్పని ఇబ్బందులు

సీతంపేట రూరల్‌, మే 9(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ పరిధిలో రేషన్‌కార్డుదారులకు కందిపప్పు అందడం లేదు. గడిచిన ఐదు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇదేమిటని ఎండీయూ వాహనాల ఆపరేటర్‌లను ప్రశ్నిస్తే సప్లయ్‌ నిలిపివేశారని.. తామేం చేస్తామని బదులిస్తున్నారు. మరోవైపు బియ్యం, పంచదార ఇతర సరుకులను కూడా ప్రతినెలా ఆలస్యంగా పంపిణీ చేస్తుండడం, సిగ్నల్‌ సమస్యలతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు.

ఇదీ పరిస్థితి..

సీతంపేట, భామిని మండలాల్లోని రేషన్‌ కార్డుదారులకు గడిచిన ఐదు నెలలుగా కందిపప్పు సరఫరా జరగడం లేదు. బియ్యం,పంచదారను మాత్రమే అందజేస్తున్నారు. వాస్తవానికి ఆ రెండు మండలాల్లో 30వేలకు పైగా రేషన్‌కార్డులు ఉన్నాయి. ప్రతి నెలా 30 టన్నుల కందిపప్పు అవసరం ఉంది. అయితే ఈ ఏడాది జనవరి నుంచి సివిల్‌ సప్లైస్‌ గోడౌన్‌కు కందిపప్పు సరఫరా నిలిచిపోయింది. దీంతో కార్డుదారులు బహిరంగ మార్కెట్‌లో రూ.102 చెల్లించి కందిపప్పును కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. గతంలో ఎండీయూ వాహనాల ద్వారా కేజీ కందిపప్పును రూ.65కు సరఫరా చేసేవారు.

ఎండీఎం, అంగన్‌వాడీలకు సరఫరా...

సీతంపేట ఐటీటీఏ పరిధిలోని భామిని, సీతంపేట మండలాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకం నిర్వహించే పాఠశాలలకు మాత్రమే కందిపప్పును పూర్తిస్థాయిలో సరఫరా చేస్తున్నారు. కానీ రేషన్‌కార్డుదారులకు మాత్రం కొద్ది నెలలుగా పంపిణీ చేయడం లేదు. దీంతో గిరిజనులకు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు.

ఆలస్యంగానే సరఫరా

ఐటీడీఏ పరిధిలోని రేషన్‌కార్డుదారులకు ప్రతి నెలా ఆలస్యంగానే నిత్యావసర సరుకుల సరఫరా జరుగుతోంది. వాస్తవంగా ప్రతి నెలా 30వ తేదీ నాటికి గోడౌన్‌కు సరుకులు చేరాల్సి ఉంది. ఇండింట్‌ ప్రాప్తికి బియ్యం, పంచదార, కందిపప్పు, ఆయిల్‌ వంటివి సివిల్‌ సప్లైస్‌ గోడౌన్‌కు 5వ తేదీ అయితే కానీ చేరడం లేదు. దీంతో 8,9,10 తేదీల్లో రేషన్‌ కార్డుదారులకు ఎండీచయూ వాహనాల ద్వారా నిత్యవసర సరుకులు అందిస్తున్నారు.

సిగ్నల్స్‌ లేక..

- సీతంపేట ఏజెన్సీ ప్రాంతంలో అధికశాతం మంది గిరిజనులు గిరిశిఖర గ్రామాల్లో నివసిస్తున్నారు. వారికి ప్రతినెలా రేషన్‌ అందించాలంటే ఎండీయూ వాహనాల నిర్వాహకులకు తలకుమించిన భారమవుతోంది. ఈ మేరకు ప్రతి నెలా నిర్దేశిత స్థలంలో వీరికి నిత్యవసర సరుకులను అందిస్తున్నారు. అయితే సిగ్నల్‌ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో కార్డుదారులు థంబ్‌ వేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రేషన్‌ పొందాలంటే ఎత్తయిన కొండ ప్రాంతం నుంచి కిందకు దిగి గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. తీరా సరుకులు ఒకటి ఉంటే ఒకటి లేకపోవడంతో గిరిజనులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.అనుకున్న సమాయానికి సివిల్‌ సప్లైస్‌ గోడౌన్‌కు సరుకులు సరఫరా జరగకపోవడంతో ఇటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

- కొత్తగూడ పంచాయతీ పరిధి కె.జమ్మడుగూడలో గురువారం ఎండీయూ వాహనం ద్వారా సరుకుల పంపిణీ చేపట్టారు. అయితే కొండపైన సిగ్నల్‌ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో సరుకుల కోసం గిరిజనులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. మరోవైపు కందిపప్పు, పంచదార అందుబాటులో లేకపోవడంతో బియ్యం, ఆయిల్‌ తదితర సరుకులను మాత్రమే అందించారు.

సివిల్‌ సప్లైస్‌ డీటీ ఏమన్నారంటే..

‘గత కొద్ది నెలలుగా సివిల్‌ సప్లైస్‌ గోడౌన్‌కు కందిపప్పు సరఫరా జరగడం లేదు. దీనికి గల కారణాలు మాకు తెలియవు. కేవలం మధ్యాహ్న భోజనం పథకం, అంగన్‌వాడీ కేంద్రాలకు మాత్రమే కందిపప్పు వస్తుంది. వాటిని జీసీసీ డిఆర్‌డిపోలకు సరఫరా చేస్తున్నాం.’ అని సివిల్‌ సప్లైస్‌ డీటీ కె.మధుసూదనరావు తెలిపారు.

Updated Date - May 09 , 2025 | 11:39 PM