District Hospital జిల్లా ఆసుపత్రిలో నీటి కొరత ఉండరాదు
ABN , Publish Date - Sep 07 , 2025 | 12:04 AM
No Water Shortage in District Hospital పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రిలో నీటి కొరత ఉండరాదని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. రానున్న వేసవిలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సంఘం సమావేశం జరిగింది.
బెలగాం, సెప్టెంబరు6(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రిలో నీటి కొరత ఉండరాదని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. రానున్న వేసవిలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రిలో అదనంగా ఒక బోరు, మున్సిపల్ లైన్ వేయాలి. కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్కు అవసరమైన రూ.5.60 లక్షలు ఎన్టీఆర్ వైద్య సేవ నుంచి మంజూరయ్యాయి. దోబీ, ఎలక్ర్టీషియన్ల నియామకానికి కూడా ఈ నిధులు వినియోగించొచ్చు. కాజువాల్టీ, లేబర్రూమ్, మెటర్నటీ వార్డుల్లో బెడ్ సైడ్ కర్టెన్లను ఏర్పాటు చేయాలి. మరుగుదొడ్లలో సదుపాయాలు, అంబులెన్స్, మహా ప్రస్థానం వాహనాలు మరమ్మతులు, నెలవారీ స్టేషనరీ కొనుగోలు , ఆపరేషన్ థియేటర్, ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు , కిటికీలకు దోమతెరలు, ఇతర పనులు త్వరితగతిన చేపట్టాలి. రోగుల కోసం స్టీల్ హ్యాండ్లింగ్ రైలింగ్, వారు కూర్చోవడానికి స్టీల్ బెంచీలు , ఆరుబయట టాయిలెట్లు ఏర్పాటు చేయాలి. ’ అని తెలిపారు. లిఫ్ట్ నిర్వహణపై ఏపీఎంఎస్ఐడీసీ ఇంజనీర్లను ప్రశ్నించారు. మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో మార్పులు, చేర్పులు, మోడరన్ మార్చురీ, రేడియాలజిస్ట్, ఎన్సీడీ డాక్టర్, స్టాఫ్నర్స్, రికార్డు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపించాలన్నారు. జిల్లా ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సూచించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ శివనాగజ్యోతి మాట్లాడుతూ.. ‘ రూ.3.18 లక్షలతో వంద పరుపులు కొనుగోలు చేశాం. రూ.1.07 లక్షలతో ఆర్వో ప్లాంట్ మరమ్మతులు , రూ.10,369తో సోలార్ హాట్వాటర్ ప్లాంట్ పనులు చేపట్టాం. రూ.99 వేలతో, మేజర్ ఓటీ -3 ఎల్ఈడీ లైట్స్ ఏర్పాటుచేశాం. లేబర్ రూమ్, ఓటి యాంగిల్ పాయింట్ లైట్స్కు రూ.23,010 వెచ్చించాం. లేబర్ రూమ్, ఫిజియోథెరిపీ పరికరాలను రూ.76,489తో కొనుగోలు చేశాం. డెంటల్ పరికరాల కోసం రూ.2.30 లక్షలు వెచ్చించాం. ’ అని తెలిపారు. ఎస్ఎన్సీయూ, యూపీఎస్ మార్పునకు రూ.74,500, కొత్త క్యాటిల్ ట్రాప్ నిర్మాణానికి రూ.80 వేలు, ప్రధాన గేటు మార్పుకు రూ.40 వేలు, జనరేటర్ చేంజ్ ఓవర్కు రూ.44 వేలు, ఇతర అవసరాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి జి.నాగభూషణరావు, డీఎంహెచ్వో ఎస్.భాస్కరరావు, ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ శ్రీదేవి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.