Share News

జనావాసాల మధ్య ఏనుగుల జోన్‌ వద్దు

ABN , Publish Date - Mar 14 , 2025 | 12:56 AM

అప్పయ్యపేట, రేపటివలస సరిహద్దుల్లో ఏనుగుల జోన్‌ పేరుతో ఫారెస్టు అధికారులు చేపట్టిన కందకాల తవ్వకాల పనులను నిలుపుదల చేయాలని సీపీఎం, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

జనావాసాల మధ్య ఏనుగుల జోన్‌ వద్దు
కందకాల పనులను అడ్డుకున్న సీపీఎం, ప్రజా సంఘాల నాయకులు

  • అధికారులు కందకాల తవ్వకం ఆపాలి

  • ప్రజా సంఘాల డిమాండ్‌

సీతానగరం, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): అప్పయ్యపేట, రేపటివలస సరిహద్దుల్లో ఏనుగుల జోన్‌ పేరుతో ఫారెస్టు అధికారులు చేపట్టిన కందకాల తవ్వకాల పనులను నిలుపుదల చేయాలని సీపీఎం, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. అక్కడ వారు గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు మాట్లాడుతూ జిల్లా నడిబొడ్డున ఉన్న సీతానగరం మండలంలో ఏనుగుల జోన్‌ పెట్టడం తగదన్నారు. ఈ ప్రాంతంలో కందకాల తవ్వకం వల్ల గిరిజనలు, దళితులు, పేదలు గత 50 ఏళ్ల నుంచి పెంచుకున్న తోటలు నాశనం అవుతున్నాయన్నారు. కొందరికి పోడు పట్టాలు, లీజు పట్టాలు ఉన్నా ఫారెస్టు అధికారులు వాటిలో తవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు. జనావాసాల మధ్య ఏనుగుల మధ్య ఏనుగుల జోన్‌ ఏర్పాటు చేస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని, ఇప్పటికే కురుపాం, కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో ప్రజలను తొక్కేస్తూ పంటలను నాశనం చేస్తున్నాయని అన్నారు. ఏనుగులు ఎక్కడ నుంచి వచ్చాయో అక్కడితే పంపించాలని డిమాండ్‌ చేశారు. ఫారెస్టు అధికారుల నిర్వాకంతో అప్పయ్యపేట, రేపటివలస, తామరకండి, పులిగుమ్మి, గుచ్చిమి, సీతారాంపురం, జోగింపేట గ్రామాల ప్రజలు ఆందోళనతో ఉన్నారన్నారు. అధికారులు తక్షణమే పనులు నిలుపుదల చేయాలని, లేకుంటే ఈ కొండ చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలతో పోరాటం ఉధృతం చేస్తాని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు రెడ్డి వేణు, మండల నాయకులు రెడ్డి ఈశ్వరరావు, గవర వెంకటరమణ, ఆర్‌.రాము, వై.రామారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2025 | 12:56 AM