New Teachers కొత్త మాస్టార్లు వచ్చేస్తున్నారు
ABN , Publish Date - Sep 16 , 2025 | 12:09 AM
New Teachers Are Coming మెగా డీఎస్సీ అభ్యర్థుల తుది జాబితాను విద్యాశాఖ సోమవారం వెల్లడించింది. ఆ వివరాలు డీఈవో కార్యాలయం వద్ద అందుబాటులో ఉన్నాయి. వెబ్సైట్లోనూ ఆ జాబితా పెట్టారు. ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 19న సీఎం చంద్రబాబు నియామక పత్రాలు అందజేస్తారు. 22 నుంచి 29 వరకు వారికి శిక్షణ ఇవ్వనున్నారు.
19న నియామక పత్రాలు అందజేత... 22 నుంచి శిక్షణ
సాలూరు రూరల్, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ అభ్యర్థుల తుది జాబితాను విద్యాశాఖ సోమవారం వెల్లడించింది. ఆ వివరాలు డీఈవో కార్యాలయం వద్ద అందుబాటులో ఉన్నాయి. వెబ్సైట్లోనూ ఆ జాబితా పెట్టారు. ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 19న సీఎం చంద్రబాబు నియామక పత్రాలు అందజేస్తారు. 22 నుంచి 29 వరకు వారికి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సమయంలోనే కౌన్సెలింగ్ ద్వారా ప్లేస్మెంట్ ఆర్డర్లు జారీ చేస్తారు. వచ్చే నెల 3న పాఠశాలల్లో విధులకు హాజరయ్యే అవకాశముంది. ఉమ్మడి జిల్లాలో 583 టీచర్ పోస్టులకు ఏప్రిల్ 20న నోటిఫికేషన్ ఇచ్చారు. జూన్ 6 నుంచి జూలై 2 వరకు విజయనగరంలో కంప్యూటర్ బేస్డ్గా పరీక్షలను నిర్వహించారు. జూలై 5న ప్రాథమిక కీ, గత నెల 1న తుది కీ విడుదల చేశారు. టెట్కు 20 శాతం మార్కుల వెయిటేజ్ ఇచ్చారు. ఈ పరీక్షలకు సంబంధించి తొలుత గత నెల 11న వ్యక్తిగత స్కోర్, 23న మెరిట్ జాబితాలను ప్రకటించారు. గత నెల 26 నుంచి 28 వరకు మెరిట్ లిస్ట్లో ఉన్న వారి ధ్రువపత్రాలు పరిశీలించారు. కాగా ఉమ్మడి జిల్లాలో ఐదుగురు అభ్యర్థులు అందుబాటులో లేనందున 578 పోస్ట్లకు ఎంపిక జాబితాను ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో జడ్పీ, ఎంపీపీ స్థానిక సంస్థలకు సంబంధించి 149 మంది సెంకడరీ గ్రేడ్ టీచర్స్తో ఎంపిక జాబితాను ప్రకటించారు. పాఠశాల సహాయకులకు సంబంధించి సోషల్ స్టడీస్లో 58 మంది, ఫిజిక్స్లో 32 , గణితంలో 8, బయాలజీలో 19 మంది, తెలుగులో 12 మంది, హిందీలో 14 మంది, ఆంగ్లంలో 19 మంది, ఫిజికల్ డైరెక్టర్ విభాగంలో 62 మందితో జాబితాలను వెల్లడించారు. సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం, నెల్లిమర్ల మున్సిపాలిటీల పరిధిలో 47 మంది ఎస్జీటీ, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పది మంది, గిరిజన సంక్షేమశాఖలో 60 మంది ఎస్జీటీలు, గిరిజన సంక్షేమశాఖలో 37 మందితో తెలుగు టీజీటీ, జోన్ పరిధిలో పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపాల్స్ విభాగాల్లో ఎంపిక జాబితాలను వెల్లడించారు.