కనీస అక్షరజ్ఞానం ఉండాలి
ABN , Publish Date - Apr 15 , 2025 | 10:57 PM
జిల్లాలో వయోజన విద్యా కార్యక్రమం కింద శిక్షణ పొందే వారికి కనీస అక్షరజ్ఞానం ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ స్పష్టం చేశారు.

-కలెక్టర్ శ్యామ్ప్రసాద్
పార్వతీపురం రూరల్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వయోజన విద్యా కార్యక్రమం కింద శిక్షణ పొందే వారికి కనీస అక్షరజ్ఞానం ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ స్పష్టం చేశారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం కలెక్టరేట్లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉల్లాస్ కార్యక్రమం కింద చదవడం, రాయడం, పుస్తకాల నిర్వహణ, ప్రయాణ సమయంలో అసౌకర్యానికి గురికాకుండా ఉండడం, ఫోన్లో వచ్చే సమాచారం అర్థం చేసుకోవడం వంటి కనీస పరిజ్ఞానం ఉండాలన్నారు. ఉల్లాస్ మొదటి దశలో గతంలో 23,944 మంది అక్షరాస్యులు అయ్యారన్నారు. ప్రస్తుత దశలో 25,579 మంది నిరక్షరాస్యులను ఇందులో చేర్పిస్తామన్నారు. మే 5వ తేదీ నుంచి సెప్టెంబరు 8 వరకు బోధనా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. వయోజన విద్య జిల్లా నోడల్ అధికారి వైకుంఠరావు మాట్లాడుతూ.. ఈ నెల 16 నుంచి 24వ తేదీ వరకు నిరక్షరాస్యుల సర్వే జరుగుతుందన్నారు. 29న మండల స్థాయిలో అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, వెలుగు ఏపీఎంలతో అవగాహనా సమావేశం నిర్వహిస్తామన్నారు. బోధనా తరగతులు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఉంటాయని తెలిపారు. ఐసీడీఎస్, మెప్మా, పంచాయతీ కార్యదర్శులు, విద్యాశాఖాధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.సుధారాణి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి.కనకదుర్గ, జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు, డీపీఆర్వో లోచర్ల రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.