Party Orders పార్టీ ఆదేశానుసారం పనిచేయాల్సిందే
ABN , Publish Date - Aug 02 , 2025 | 12:01 AM
Must Act as per Party Orders అధినాయకత్వం ఆదేశాలు మేరకు నాయకుడి నుంచి కార్యకర్త వరకు పనిచేయాల్సిందేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాశ్రీనివాసరావు స్పష్టం చేశారు. శుక్రవారం విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో అరకు పార్లమెంట్ పరిధిలోని పాలకొండ నియోజకవర్గం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది.
కొందరు పార్టీ నాయకులు జనసేన ఎమ్మెల్యేతో పనిచేస్తున్నారు
గ్రామ, మండల కమిటీల నియామకంలో అడ్డు పడుతున్నారు
ఫిర్యాదు చేసిన కొందరు నియోజవర్గ పార్టీ నాయకులు
విశాఖపట్నం/పార్వతీపురం, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): అధినాయకత్వం ఆదేశాలు మేరకు నాయకుడి నుంచి కార్యకర్త వరకు పనిచేయాల్సిందేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాశ్రీనివాసరావు స్పష్టం చేశారు. శుక్రవారం విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో అరకు పార్లమెంట్ పరిధిలోని పాలకొండ నియోజకవర్గం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో నాయకుల మధ్య విభేదాలు పరిష్కరించుకోవాలన్నారు. అందరూ కలిసి పార్టీ బలోపేతానికి పనిచేయాలని, లేకపోతే అధిష్ఠానం ఒక నిర్ణయం తీసుకుంటుందని హెచ్చరించారు. సమన్వయం చేసుకోకపోవడంతో గ్రామ/మండల కమిటీల నియామకం పూర్తిచేయలేదని, ప్రభుత్వం పిలుపు మేరకు సుపరిపాలన కార్యక్రమం కూడా చేయకపోవడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. రెండుమూడు రోజుల్లో ఇన్చార్జి పడాల భూదేవి, అన్ని మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు కలిసి చర్చించుకుని కార్యక్రమాల అమలు దిశగా పనిచేయాలని సూచించారు.
- ఉత్తరాంధ్ర పార్టీ ఇన్చార్జి దామచర్ల సత్య మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, విభేదాలు వీడనాడాలని కోరారు. నియోజకవర్గంంపై పార్టీ దృష్టిసారించిందన్నారు. నియోజకవర్గఇన్చార్జి భూదేవి అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని, మిగిలిన వారు కూడా ఆమెకు సహకరించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొందరు నాయకులు లేచి నియోజకవర్గంలో టీడీపీలో ఉన్న కొందరు జనసేన పార్టీ ఎమ్మెల్యేతో కలిసి పనిచేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇటువంటి వ్యక్తులే గ్రామ/ మండల కమిటీలు నియామకంలో అడ్డుపడుతున్నారని వ్యాఖ్యానించారు. సమావేశంలో అరకు పార్లమెంటు అధ్యక్షుడు కిడారి శ్రావణ్కుమార్, పాలకొండ నియోజకవర్గ ఇన్చార్జిలు టి. హర్షవర్థన్, శివ్వాల సూర్యనారాయణ, నియోజకవర్గం పరిధిలో మండల పార్టీ అధ్యక్షులు గండి రామినాయుడు, ఉదయాన ఉదయభాస్కర్, ముఖలింగం, భోగాపురం రవినాయుడు, పాలకొండ పట్టణ అధ్యక్షుడు గంటా సంతోష్ పలువురు నాయకులు పాల్గొన్నారు.