Share News

Minister Kondapalli Srinivas:అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులు

ABN , Publish Date - May 09 , 2025 | 11:46 PM

Minister Kondapalli Srinivas:రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ) ఏర్పాటు చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు.

Minister Kondapalli Srinivas:అన్ని నియోజకవర్గాల్లో  ఎంఎస్‌ఎంఈ పార్కులు
కొత్తవలస: బలిఘట్టంలో ఎంఎస్‌ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే లలితకుమారి

- కొత్త పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొస్తాం

- మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

కొత్తవలస/నెల్లిమర్ల, మే 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ) ఏర్పాటు చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలం బలిఘట్టంలో ఎంఎస్‌ఎంఈ పార్కుకు, నెల్లిమర్ల నియోజకవర్గ కేంద్రంలోని సారిపల్లిలో ప్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఏర్పాటయ్యే ఏ కొత్త పరిశ్రమైనా రాష్ట్రంలో ఏర్పాటు చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు సంపూర్ణ సహకారం అందించేందుకు సీఎం ముందుకు వస్తున్నారు. ‘రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులు, ప్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేయాలని కృత నిశ్చయంతో సీఎం ఉన్నారు. మొదటి దశలో 50 పార్కులు ఏర్పాటు చేస్తాం. జిల్లాలో శృంగవరపుకోట, గజపతినగరం, బొబ్బిలి, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తాం. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి. వారికి 25 నుంచి 45 శాతం వరకు రాయితీలు, విద్యుత్‌, పన్నుల్లో రాయితీ, బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు అవసరమైన సహకారం అందిస్తాం. బలిఘట్టం ఎంఎస్‌ఎంఈ పార్కులో రూ.96 కోట్లతో 76 చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. వీటివల్ల 1500 మందికి ప్రత్యక్షంగా, 500 మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుంది. సారిపల్లి వద్ద మూడు ఎకరాల స్థలంలో రూ.15.55 కోట్లతో నిర్మించనున్న ప్లాటెడ్‌ కాంప్లెక్స్‌ ద్వారా 200 మందికి ప్రత్యక్షంగా, 50 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.’ అని అన్నారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి యూనిట్లను స్థాపించేందుకు అనువుగా వారికి శిక్షణ ఇచ్చి ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు వెళ్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, లోకం నాగమాధవి, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ మురళీమోహాన్‌, పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ శ్రీధర్‌, ఆర్డీవోలు దాట్ల కీర్తి, బి.రామకృష్ణ, తహసీల్దార్లు నీల కంఠారావు, సుదర్శనరావు, ఎంపీపీలు నీలంశెట్టి గోపెమ్మ, బంటుపల్లి వాసుదేవరావు, నెల్లిమర్ల నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ బంగారు సరోజిని, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2025 | 11:46 PM