Share News

App యాప్‌తో పర్యవేక్షణ

ABN , Publish Date - Nov 23 , 2025 | 12:16 AM

Monitoring Through an App గిరిజన విద్యా సంస్థల పనితీరు మెరుగుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఏఐతో కూడిన హాస్టల్‌ ఫెర్ఫార్మెన్స్‌ మానటరింగ్‌ సిస్టం (హెచ్‌పీటీఎస్‌) యాప్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా గిరిజన విద్యా సంస్థలను పర్యవేక్షిస్తూ.. సమస్యలను పరిష్కరించనున్నారు. హాస్టళ్లలో పొరపాట్లు, అవకతవకలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోనున్నారు.

  App యాప్‌తో  పర్యవేక్షణ
హెచ్‌పీటీఎస్‌ యాప్‌

  • సమూల మార్పులకు చర్యలు

గుమ్మలక్ష్మీపురం, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): గిరిజన విద్యా సంస్థల పనితీరు మెరుగుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఏఐతో కూడిన హాస్టల్‌ ఫెర్ఫార్మెన్స్‌ మానటరింగ్‌ సిస్టం (హెచ్‌పీటీఎస్‌) యాప్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా గిరిజన విద్యా సంస్థలను పర్యవేక్షిస్తూ.. సమస్యలను పరిష్కరించనున్నారు. హాస్టళ్లలో పొరపాట్లు, అవకతవకలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలో 77 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, 10 గిరిజన గురుకుల పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, 19 పోస్టుమెట్రిక్‌ హాస్టల్స్‌, నాలుగు ఏకలవ్య పాఠశాలలను ఈ యాప్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. ఆయా విద్యా సంస్థల్లో రోజూ చేపట్టే పారిశుధ్యం పనులు, వంట పాత్రల క్లీనింగ్‌, ఆహారం తయారీ, క్లాస్‌ రూములు, హాస్టల్‌ గదుల్లో పరిస్థితి, వాటర్‌ ట్యాంకులు, మినరల్‌ వాటర్‌ ప్లాంట్ల పనితీరు, విద్యార్థుల సిక్‌ రూమ్‌ల ఫొటోలను తీసి.. నూతన యాప్‌లో వార్డెన్లు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. సికిల్‌ సెల్‌ ఎనీమియా, క్షయ తదితర వ్యాధులతో బాధపడుతున్న విద్యార్థులకు అందిస్తున్న వైద్యసేవలు, వారి బ్లడ్‌ గ్రూప్‌ సమాచారం కూడా ఇందులో నమోదు చేయాల్సి ఉంది. మరుగుదొడ్ల పరిస్థితి, క్లాస్‌రూమ్‌లు కొరత, భవనాల మరమ్మతులు ఇతర సమస్యలను ఈయాప్‌లో నమోదు చేయాలి. రోజువారీ, వారానికొకసారి చొప్పున మరికొన్ని అంశాలను హెచ్‌పీటీఎస్‌ ద్వారా అధికారులకు తెలియజేయాలి. వాటిని పరిశీ లించిన అనంతరం నిధులు మంజూరు చేసి మౌలిక వసతులు కల్పిస్తారు. ఈ యాప్‌ను గిరిజన విద్యా సంస్థల ఉన్నతాధికారులు, ఏటీడబ్ల్యూవో, ఐటీడీఏ పీవో తదితరులు పర్యవేక్షించాలి. రాత్రిపూట బస చేసి విద్యా సంస్థల్లో పరిస్థితిని తెలుసుకోవాల్సి ఉంది. ఇప్పటికే జిల్లాలో అధికా రులు హెచ్‌పీటీఎస్‌ యాప్‌ ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.

పనితీరు మెరుగుకు చర్యలు

గిరిజన విద్యా సంస్థల పనితీరు పూర్తిస్థాయిలో మెరుగుపర్చడానికి అన్ని చర్యలు తీసుకుం టున్నాం. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. ఉన్నతాఽధికారుల ఆదేశాలతో హెచ్‌పీటీఎస్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేశాం. దాని ద్వారా గిరిజన విద్యా సంస్థలను కలెక్టర్‌, ఇతర అధికారులంతా ప్రత్యేక శ్రద్ధతో పరిశీలిస్తున్నారు.

- యశ్వంత్‌కుమార్‌రెడ్డి, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, పార్వతీపురం

======================================

ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తున్నాం..

హెచ్‌పీటీఎస్‌ యాప్‌ను గత రెండు రోజుల నుంచి వినియోగిస్తున్నాం. విద్యార్థుల ఆరోగ్యం, మెనూ అమలు, పారిశుధ్యం తదితర సమాచారాన్ని ఏరోజుకారోజు ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నాం. ఉన్నతాధికారులు వాటిని పరిశీలిస్తారు.

- యుగంధర్‌ ప్రిన్సిపాల్‌, గురుకుల జూనియర్‌ కళాశాల, భద్రగిరి

Updated Date - Nov 23 , 2025 | 12:16 AM