Share News

మంత్రి వర్సెస్‌ జడ్పీ చైర్మన్‌

ABN , Publish Date - Apr 09 , 2025 | 11:59 PM

Minister vs. Chairman of ZP జడ్పీ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రీ వేరిఫికేషన్‌ పేరుతో కొంతమంది పింఛన్‌దారులు బెంబేలెత్తిపోతున్నారని ఓ సభ్యుడు ప్రస్తావించగా మంత్రి కొండపల్లి సమాధానం ఇస్తూ.. గత ప్రభుత్వం కంటే ఇప్పుడే అర్హులైన లబ్ధిదారులకు పింఛన్‌లు సక్రమంగా అందుతున్నాయన్నారు.

మంత్రి వర్సెస్‌ జడ్పీ చైర్మన్‌
సమవేశంలో మాట్లాడుతున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

మంత్రి వర్సెస్‌ జడ్పీ చైర్మన్‌

వాడీవేడిగా జడ్పీ సర్వసభ్య సమావేశం

అనర్హుల పెన్షన్‌లు తొలగిస్తాం.. అర్హులవి తొలగించం

మంత్రి కొండపల్లి స్పష్టీకరణ

బోర్లు మరమ్మతులకు అవసరమైతే ఎంపీ నిధులు : కలిశెట్టి

విజయనగరం, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి):

జడ్పీ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రీ వేరిఫికేషన్‌ పేరుతో కొంతమంది పింఛన్‌దారులు బెంబేలెత్తిపోతున్నారని ఓ సభ్యుడు ప్రస్తావించగా మంత్రి కొండపల్లి సమాధానం ఇస్తూ.. గత ప్రభుత్వం కంటే ఇప్పుడే అర్హులైన లబ్ధిదారులకు పింఛన్‌లు సక్రమంగా అందుతున్నాయన్నారు. మధ్యలో జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు కల్పించుకుని మాట్లాడుతూ ప్రతి విషయానికీ గత ప్రభుత్వం, గత ప్రభుత్వం అనవద్దని, ప్రస్తుత ప్రభుత్వం రీ వెరిఫికేషన్‌ పేరుతో పింఛన్‌దారులను భ్రయబ్రాంతులకు గురిచేస్తోందన్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం సాగింది. ఇది మినహా జడ్పీ సమావేశం ప్రశాంతంగా జరిగింది. వేసవిలో తాగునీటి సమస్యపైనే ఎక్కువ సమయం చర్చ జరిగింది.

జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం బుధవారం జడ్పీ సమావేశ భవనంలో అరగంట ఆలస్యంగా 11 గంటలకు ప్రారంభమైంది. జడ్పీ సీఈఓ బీవీ సత్యనారాయణ సమావేశాన్ని ప్రారంభించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్‌ అంబేడ్కర్‌తో పాటు పార్వతీపురం మన్యం కలెక్టర్‌ శ్యామ్‌కుమార్‌ హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలో కురుపాం నియోజకవర్గంలో ఏకలవ్య పాఠశాల గురించి మండల పరిషత్‌ అధ్యక్షులు, జడ్పీటీసీలు ప్రస్తావించారు. కలెక్టర్‌ శ్యామ్‌కుమార్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీర్ఘకాలికంగా వున్న పాఠశాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఆ తర్వాత మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసరావు మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. జడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పెన్షన్‌లు తొలగిస్తున్నారని, గత ప్రభుత్వం ఈ విధంగా చేయలేదని అనగానే మంత్రి కొండపల్లి ధీటుగా బదులిచ్చారు. గత ప్రభుత్వ నిర్వాకాలు చాలా ఉన్నాయని, అవన్నీ చెప్పుకుంటే సమావేశం సమయం కూడా చాలదని, పెన్షన్‌ల విషయంలో గత ప్రభుత్వం అనర్హులకు పెద్దపీట వేసిందన్నారు. అర్హులకు అందాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం దానిపై సమగ్ర నివేదికను సిద్ధం చేస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హుల పెన్షన్‌లు తొలగించబోమని స్పష్టం చేశారు.

తాగునీటి సమస్య లేకుండా చూడండి

జడ్పీ సమావేశం అజెండాలో తొలి అంశంగా గ్రామీణ నీటి సరఫరా విభాగంపై సమీక్ష జరిగింది. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన ఎస్‌ఈలు తమ, తమ జిల్లాల్లో ఆర్‌డబ్ల్యూఎస్‌ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలు, వేసవి నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై వివరించారు. దీనిపై ఎమ్మెల్సీ పీవీ సూర్యనారాయణరాజు, తెర్లాం జడ్పీటీసీ, గజపతినగరం జడ్పీటీసీ గార తౌడు తదితరులు తమ, తమ ప్రాంతాల్లో వేసవిలో ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. వీటిని పరిష్కరించాలని కోరారు. తాగునీటి సమస్య ఎక్కడ ఉన్నా పరిష్కరించాలని జడ్పీ చైర్మన్‌ ఎస్‌ఈలకు సూచించారు. ఇదే విషయమై విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. నిధులు అవసరమైతే ఎంపీ నిధుల నుంచి వినియోగించాలని సూచించారు. తాగునీటి అవసరాల కోసం అత్యవసరంగా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ చెప్పారు.

ఉపాధి హామీ పథకంపై సమీక్షలో పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు మాట్లాడుతూ ఉపాధి వేతనాల బకాయిల గురించి ప్రశ్నించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, ఉపాధి వేతనాలు ఈ నెలలోనే చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. కాగా జడ్పీ సర్వసభ్య సమావేశంలో 11 శాఖలపై సమీక్ష జరిగింది.

---

Updated Date - Apr 09 , 2025 | 11:59 PM