మలేరియా నియంత్రణకు చర్యలు
ABN , Publish Date - Jul 05 , 2025 | 10:40 PM
Measures for Malaria Control జిల్లాలో మలేరియా నియంత్రణే లక్ష్యంగా పనిచేస్తున్నామని డీఎంహెచ్వో ఎస్.భాస్కరరావు తెలిపారు. దీనిలో భాగంగా మొదటి విడతగా లక్ష గంబూషియా చేపలను సరఫరా చేశామన్నారు. ఈ మేరకు శనివారం కొత్తవలస చెరువులో ఆ చేపలను విడుదల చేశారు.
డీఎంహెచ్వో భాస్కరరావు
పార్వతీపురం, జూలై 5(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మలేరియా నియంత్రణే లక్ష్యంగా పనిచేస్తున్నామని డీఎంహెచ్వో ఎస్.భాస్కరరావు తెలిపారు. దీనిలో భాగంగా మొదటి విడతగా లక్ష గంబూషియా చేపలను సరఫరా చేశామన్నారు. ఈ మేరకు శనివారం కొత్తవలస చెరువులో ఆ చేపలను విడుదల చేశారు. జిల్లాలో ముందుగా గుర్తించిన 178 చెరువుల్లో గంబూషియా చేపలను విడుదల చేశామన్నారు. చెరువుల్లో ఉన్న దోమల లార్వాలను అవి తిని మలేరియా, డెంగ్యూ నివారణకు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ఇప్పటికే 915 గ్రామాల్లో ఐఆర్ఎస్ మొదటి దశ స్ర్పేయింగ్ పూర్తి చేశామని, ప్రస్తుతం రెండో విడత జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుందని వెల్లడించారు. వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు ఫీవర్ సర్వే చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఈడీఆర్బీ ఎస్కే జిల్లా ప్రోగ్రాం అధికారి టి.జగన్మోహన్రావు, ఏఎంవో సూర్యనారాయణ, కన్సల్టెంట్ రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.
పర్యవేక్షణ తప్పనిసరి
మాతా, శిశు ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని డీఎంహెచ్వో భాస్కరరావు ఆదేశించారు. శనివారం పార్వతీపురం ఎన్జీవో హోంలో ఆశా కార్యకర్తలు, నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆర్సీహెచ్ మాతా శిశు నమోదులో ఏఎన్ఎం, ఆశా కార్యకర్తల పనితీరు విశ్లేషించాలన్నారు. గర్భిణులకు హిమోగ్లోబిన్, షుగర్, బీపీ, క్షయ వంటి పరీక్షలు తప్పనిసరిగా చేయాలని సూచించారు. పీహెచ్సీల వారీగా డెలివరీ నివేదికలను ప్రతి నెలా సమీక్షిస్తామన్నారు.