Math is the key గణితం కీలకం
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:11 AM
Math is the key మనిషి జీవితంలో లెక్కల ప్రమేయం లేకుండా ఒక్క రోజు కూడా గడవదు అనడంలో అతిశయోక్తి లేదు. పుట్టిన తేదీలు, ఇంటి బడ్జెట్, టైం మేనేజ్మెంట్, కూడికలు, తీసివేతలు, వెచ్చింపులూ ఇలా ఎన్నో విధాలా లెక్కలు మన జీవితంలో భాగమైపోయాయి. అలాగే కాంపిటేటివ్ ప్రపంచంలో నెగ్గాలన్నా లెక్కలు కీలకం. ఈ సబ్జెక్టును సాధన ద్వారా సులువుగా నేర్చుకోవచ్చునని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. డిసెంబరు 22న జాతీయ గణిత దినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక కథనం.
గణితం కీలకం
నేర్చుకుంటే ఎన్నో లాభాలు
సాధనతో ఈజీ అంటున్న ఉపాధ్యాయులు
నేడు గణిత దినోత్సవం
మనిషి జీవితంలో లెక్కల ప్రమేయం లేకుండా ఒక్క రోజు కూడా గడవదు అనడంలో అతిశయోక్తి లేదు. పుట్టిన తేదీలు, ఇంటి బడ్జెట్, టైం మేనేజ్మెంట్, కూడికలు, తీసివేతలు, వెచ్చింపులూ ఇలా ఎన్నో విధాలా లెక్కలు మన జీవితంలో భాగమైపోయాయి. అలాగే కాంపిటేటివ్ ప్రపంచంలో నెగ్గాలన్నా లెక్కలు కీలకం. ఈ సబ్జెక్టును సాధన ద్వారా సులువుగా నేర్చుకోవచ్చునని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. డిసెంబరు 22న జాతీయ గణిత దినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక కథనం.
విజయనగరం కలెక్టరేట్ డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి):
ఎప్పుడో అంతమైపోయిన జీవుల వయసు మొదలుకుని రాబోయే గ్రహణాల వరకు తెలుసుకోవాలంటే లెక్కలతోనే సాధ్యం. మన ఇంటి నుంచి వెళ్లబోయే ఊరికి దూరమెంత?.. దుకాణం నుంచి తెచ్చిన సరుకు బరువెంత? హిమాలయాల ఎత్తు ఎంత? అగాథాల లోతు ఎంత? ఇలా ఎన్నో అంశాలు లెక్కలు లేకపోతే లేనట్టే. ఇంత కీలకమైన సబ్జెక్టును వంటబట్టించుకుంటే ఆ విద్యార్థికి భవిష్యత్లో ఇక తిరుగే ఉండదని లెక్కల మాస్టార్లు చెబుతుంటారు. మనకున్న అపూర్వ గణిత మేధావులలో ఒకరైన శ్రీనివాస రామానుజన్ జయంతి డిసెంబరు 22ను జాతీయ గణిత దినోత్సవంగా పాటిస్తున్నాం. రామానుజన్ చిన్న వయసు నుంచే కష్టాలకు ఎదురీది పట్టుదలతో గణితం నేర్చుకుని ఆపై అధ్యయనం చేశారు. అనేక కొత్త అంశాలను ఆవిష్కరించారు.
ఒకప్పుడు లెక్కలు అంటే విద్యార్థుల్లో భయం ఉండేది. నేడు సులువుగా అర్థం అయ్యేలా బోధన సాగుతోంది. ఎక్కువ మందికి గణితంపై మక్కువ పెరిగింది. మిగిలిన సబ్జెక్టుల కంటే గణితంపై దృష్టి పెడుతున్నారు. ప్రభుత్వం కూడా గణితం సబ్జెక్టును అందరూ సులవులుగా అర్థం చేసుకునేలా పాఠ్య పుస్తకాలను మార్పు చేసింది. ప్రత్యేకంగా గణితం కోసం కొన్ని పాఠశాలల్లో ప్రయోగశాలలు ఏర్పాటు చేశారు. కాగా పిల్లలు గణితం పరిశీలన ద్వారా లెక్కించడం, కొలతలు తీసుకోవడం, సరి చూడటం, అంచనా వేయడం , ప్రయోగాలు చేయడం గురించి 8వ తరగతి వరకూ నేర్చుకుంటున్నారు. 9వ తగరతి నుంచి 12వ తరగతి వరకూ ఆల్జీబ్రా, జామెట్రీ, త్రికోణిమితి గురించి వివరంగా తెలుసుకుంటున్నారు.
హేతుబద్ధమైన అంశాలను తెలుసుకోవాలి
గణితంలో విద్యార్థులు రాణించాలంటే భాషపై పట్టు ఉండాలి. తద్వారా గణితంలో ఇచ్చే సమస్యలను అర్థం చేసుకోవడం సులువు అవుతుంది. దానిలో ఇమిడి ఉండే హేతుబద్ధమైన అంశాలను అవగాహన చేసుకోలేకపోవడం ద్వారా మరింతగా రాణించవచ్చు. విద్యార్థులు ఒత్తిడి తగ్గించుకుంటే గణితం నేర్చుకోవచ్చు. పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా కూడా విద్యార్థులకు గణితం నేర్పిస్తున్నాం.
జీవీబీ ఎస్ఎన్ రాజు, స్కూల్ అసిస్టెంట్(గణితం), కస్పా స్కూల్, విజయనగరం
చతుర్థి ప్రక్రియను నేర్చుకోవాలి
ప్రతి విద్యార్థికీ గణితం అంటే భయం పోవాలంటే ఫౌండేషన్ స్థాయిలో చతుర్థి ప్రక్రియను నేర్చుకోవాలి. అటువంటి వారికి గణితం అంటే భయం ఉండదు. ప్రభుత్వం ఈ ఏడాది నుంచి రెమిడియల్ తరగతులు ఏర్పాటు చేస్తోంది. తరగతిలో వెనుకబడి ఉన్న విద్యార్థులకు ఇది చాలా ఉపయోగం. అబాకస్, వేదగణితం నేర్చుకున్న విద్యార్థులు చేతివేళ్లపై లెక్కలు చేస్తారు. ఇటువంటి వారే ఐఐటీ, ఎన్ఐటీ ప్రవేశ పరీక్షల్లో సీట్లు సాధిస్తున్నారు.
ఎ.సత్యనారాయణ, స్కూల్ అసిస్టెంట్, గణితం, సారపల్లి జడ్పీ హైస్కూల్