Indonesia ఇండోనేషియాకు మామిడిపల్లి కుర్రోడు
ABN , Publish Date - Jul 17 , 2025 | 12:02 AM
Mamidipalli Youth Heads to Indonesia వండర్ బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ చాంపియన్షిప్కు మామిడిపల్లి వాసి కనకల వరప్రసాద్ కోచ్గా వెళ్లారు. ఇండోనేషియా దేశం సోలో నగరంలో ఈ నెల 18 నుంచి 27 వరకు పీబీఎస్ఐ (పెర్శాటన్ బూలుటాయక్గీస్ సెలుర్హు ఇండోనేషియా ) ఆధ్వర్యంలో ఈ పోటీలు జరగనున్నాయి. భారత్ తరఫున 28 మందితో కూడిన క్రీడాబృందం ఇప్పటికే ఆ నగరానికి చేరుకుంది.
గ్రామస్థులు, కుటుంబ సభ్యులు హర్షం
సాలూరు రూరల్, జూలై 16(ఆంధ్రజ్యోతి): వండర్ బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ చాంపియన్షిప్కు మామిడిపల్లి వాసి కనకల వరప్రసాద్ కోచ్గా వెళ్లారు. ఇండోనేషియా దేశం సోలో నగరంలో ఈ నెల 18 నుంచి 27 వరకు పీబీఎస్ఐ (పెర్శాటన్ బూలుటాయక్గీస్ సెలుర్హు ఇండోనేషియా ) ఆధ్వర్యంలో ఈ పోటీలు జరగనున్నాయి. భారత్ తరఫున 28 మందితో కూడిన క్రీడాబృందం ఇప్పటికే ఆ నగరానికి చేరుకుంది. ఈ బృందంలో 19 మంది ఆటగాళ్లు, ఐదుగురు కోచ్లు ( ఒకరు రష్య, మరొకరు దక్షిణ కొరియా, ముగ్గురు భారతీయులు ) ఇద్దరు ఫిజియో, ఒక ట్రైనర్, ఒక మాసేస్ ఉన్నారు. అయితే ఐదుగరు కోచ్ల్లో ఏపీ నుంచి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లికి చెందిన వరప్రసాద్ ఒకరు ఉండడం విశేషం. ఆయన మామిడిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఆ సమయంలో అప్పటి పీడీ శ్రీరాములు వద్ద బ్యాడ్మింటన్లో మెలకువ నేర్చుకున్నారు. అనంతరం నంద్యాలలో వెంకట్, ఖమ్మంలో సుధాకర్రెడ్డి వద్ద ప్రావీణ్యం పొందారు. వివిధ రాష్ట్ర, జాతీయ పోటీల్లో పాల్గొని పలు అవార్డులు కైవసం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లో కోచ్ దిలీప్ వద్ద కోచ్గా వ్యవహరించే తీరు, సామర్థ్యం తదితర వాటిపై శిక్షణ పొందారు. ప్రస్తుతం అస్సాం రాష్ట్ర బ్యాడ్మింటన్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ చాంపియన్షిప్ పోటీలకు కోచ్గా ఎంపికై ఇండోనేషియా వెళ్లారు. దీనిపై మామిడిపల్లి వాసులు, కుటుంబ సభ్యులు, పూర్వ పీడీ శ్రీరాములు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.