Main Exam for Constable Recruitment కానిస్టేబుళ్ల ఎంపికకు నేడు ప్రధాన పరీక్ష
ABN , Publish Date - May 31 , 2025 | 11:34 PM
Main Exam for Constable Recruitment Today పోలీస్ కానిస్టేబుళ్ల ఎంపిక తుది అంకమైన ప్రధాన పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఆదివారం విజయనగరం కేంద్రంలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన పోస్టుల భర్తీ
సాలూరు రూరల్, మే 31 (ఆంధ్రజ్యోతి): పోలీస్ కానిస్టేబుళ్ల ఎంపిక తుది అంకమైన ప్రధాన పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఆదివారం విజయనగరం కేంద్రంలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలో పోలీస్ కానిస్టేబుళ్ల ఎంపికకు 2022లో అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. 134 పోస్టుల భర్తీకి 2022 నవంబరులో నోటిఫికేషన్ ఇచ్చారు. 30 వేల మందికి పైబడి దరఖాస్తులు చేసుకున్నారు. ఈ పోస్టులకు 2023, జనవరి 23న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. 27,870 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 9,152 మంది దేహదారుఢ్య పరీక్షకు ఎంపికయ్యారు. అయితే వారికి ఈ పరీక్షను నిర్వహించకుండా జాప్యం చేశారు. దీంతో కానిస్టేబుళ్ల నియమాక ప్రక్రియ మూలన పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియను పట్టాలెక్కించింది. 9,152 మందికి ఈ ఏడాది జనవరి 22 వరకు పరీక్షను నిర్వహించి 4,549 మందిని ఎంపిక చేశారు. తాజాగా ప్రధాన పరీక్ష నిర్వహించేందుకు చర్యలు చేపట్టడంతో అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.