Lack of response to the rally ర్యాలీకి స్పందన కరువు
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:02 AM
Lack of response to the rally ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ప్రభుత్వం తీసుకురాదలిచిన పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ బుధవారం చేపట్టిన నిరసన ర్యాలీలకు స్పందన కరువైంది. కీలక నాయకులే పాల్గొనలేదు. పలు నియోజకవర్గాల్లో ఇన్చార్జ్లు సైతం ముఖం చాటేశారు.
ర్యాలీకి స్పందన కరువు
ముఖం చాటేసిన వైసీపీ కీలక నాయకులు
మధ్యలో ఉడాయించిన ఇంకొందరు
విజయనగరం, నవంబరు12(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ప్రభుత్వం తీసుకురాదలిచిన పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ బుధవారం చేపట్టిన నిరసన ర్యాలీలకు స్పందన కరువైంది. కీలక నాయకులే పాల్గొనలేదు. పలు నియోజకవర్గాల్లో ఇన్చార్జ్లు సైతం ముఖం చాటేశారు. జిల్లా కేంద్రంలో మాజీ శాసన ఉప సభాపతి కోలగట్ల హాజరైన ర్యాలీలో నగరపాలక సంస్థకు చెందిన 47మంది కార్పొరేటర్లలో 10మంది మాత్రమే హాజరయ్యారు. ద్వితీయ శ్రేణి నాయకులు ఆ ప్రాంత దరిదాపులకు రాలేదు. సీఎంఆర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ తహసీల్దార్ కార్యాలయానికి చేరేసరికి సగంమంది జారుకున్నారు. తహసీల్దార్ లేకపోవడంతో వినతితప్రం తీసుకునేందుకు డిప్యూటీ తహసీల్దార్ వచ్చారు. తహసీల్దార్ రావాలని మొండిచేస్తూ కార్యకర్తలు కార్యాలయం ఆవరణలోనే బైఠాయించారు. దీంతో తహసీల్దార్కు సిబ్బంది సమాచారం ఇవ్వడంతో ఆయన కార్యాలయానికి చేరుకుని వినతితప్రం అందుకున్నారు.
చీపురుపల్లిలో శాసనసభ ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ హాజరైప్పటికీ నాయకులు, కార్యకర్తల్లో స్పందన కరువైంది. రాజాంలో ఇన్చార్జి టి.రాజేష్ పాల్గొన్నారు. కార్యకర్తలు అంతంతమాత్రమే హాజరుయ్యారు. గజపతినగరంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య హాజరైనప్పటికీ కార్యకర్తలు తగినంతగా కానరాలేదు. బొబ్బిలిలో మాజీ ఎమ్మేల్యే శంబంగి చిన్నప్పలనాయుడు హాజరైనప్పటికీ స్పందన అంతంతమాత్రమే. ఎస్కోటలో నియోజకవర్గ ఇన్చార్జ్ రాలేదు. మాజీ ఎమ్మెల్యే శోభాహైమావతి, వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడుబాబు ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమం మొక్కుబడిగా సాగింది. ఇలా జిల్లా వ్యాప్తంగా స్పందన అంతంత మాత్రంగానే కనిపించింది.