It's time for school బడికి వేళాయె
ABN , Publish Date - Jun 11 , 2025 | 11:50 PM
It's time for school వేసవి సెలవుల అనంతరం తొలిసారిగా బడిగంట మోగనుంది. పాఠశాలలన్నీ యథావిధిగా గురువారం తెరుచుకోనున్నాయి. విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు కూడా సిద్ధమయ్యారు. విద్యార్థులు ఇకపై సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం చేయనున్నారు. మరోవైపు విద్యామిత్ర కిట్లు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా క్లస్టర్ విధానం కూడా అమలులోకి వస్తోంది.
బడికి వేళాయె
నేడు పాఠశాలల పునఃప్రారంభం
సన్నబియ్యంతో విద్యార్థులకు భోజనం
విద్యామిత్ర కిట్లు సిద్ధం
విజయనగరం/కలెక్టరేట్/ రాజాం రూరల్, జూన్ 11(ఆంధ్రజ్యోతి): వేసవి సెలవుల అనంతరం తొలిసారిగా బడిగంట మోగనుంది. పాఠశాలలన్నీ యథావిధిగా గురువారం తెరుచుకోనున్నాయి. విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు కూడా సిద్ధమయ్యారు. విద్యార్థులు ఇకపై సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం చేయనున్నారు. మరోవైపు విద్యామిత్ర కిట్లు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా క్లస్టర్ విధానం కూడా అమలులోకి వస్తోంది.
పాఠశాల విద్యను బలోపేతం చేసే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేసింది. పాఠశాలలు తెరిచిన తొలిరోజే విద్యార్థులకు సుమారు రూ.2,279 విలువచేసే డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యామిత్ర కిట్లు అందించనుంది. ఒక్కో కిట్లో పాఠ్యపుస్యకాలు, వర్క్బుక్తో పాటు రాత పుస్తకాలు, ఆక్స్ఫర్డ్ నిఘంటువు, మూడు జతల ఏకరూప దుస్తులు, బూట్లు, రెండుజతల సాక్సులు, బ్యాగ్, బెల్ట్ను అందజేస్తారు. గతంలో మాదిరిగా కాకుండా సరికొత్త రంగుల ఏకరూప దుస్తులను ఎంపిక చేశారు. బాలబాలికలకు గతంలో వేర్వేరురంగుల దుస్తుల్ని అందించగా ఈసారి అందరికీ ఒకేరంగు దుస్తులు ఇవ్వనున్నారు. దుస్తులు కుట్టించుకునేందుకు అవసరమైన మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది. కిట్ల తరలింపు ప్రక్రియను ఎంఈవోలు పర్యవేక్షిస్తున్నారు.
సన్నబియ్యంతో భోజనం
మధ్యాహ్న భోజన పథకం పేరును డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా మార్చారు. దీంతోపాటు ఈ విద్యా సంవత్సరం నుంచి పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో పోషకాలతో కూడిన సన్నబియ్యాన్ని పంపిణీ చేశారు. గతంలో 50 కిలోల బియ్యం బస్తాలు అందించగా ఈసారి 25 కిలోల బ్యాగ్లు ఇచ్చేలా మార్పులు చేశారు. బియ్యంలో అక్రమాలు చోటుచేసుకోకుండా క్యూ ఆర్కోడ్ ఉన్న ట్యాగ్ను ఏర్పాటు చేశారు.
జిల్లాలో పాఠశాలలు 2283
విద్యార్థులు 1.14 లక్షలు
భోజనం చేసేవారి సంఖ్య 1.12 లక్షలు
సన్నబియ్యంతో భోజనం
మాణిక్యంనాయుడు, డీఈవో
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి సన్నబియ్యంతో భోజనం అందించే ఏర్పాట్లు చేశాం. పోర్టిఫైడ్ బియ్యం కావడంతో పోషకాలు అధికంగా ఉంటాయి. విద్యార్థులందరూ పాఠశాలల్లోనే భోజనం చేయాలి. తల్లిదండ్రులు ఇందుకు సహకరించాలి. విద్యామిత్ర కిట్లు కూడా అందించే ఏర్పాట్లు చేశాం.
--------------