ప్రగతి పథం పట్టేనా?
ABN , Publish Date - Apr 22 , 2025 | 12:09 AM
Is there progress? వ్యవసాయం ప్రధానంగా ఉన్న జిల్లాలో సాగునీటితో కళకళలాడాల్సిన కీలక ప్రాజెక్టులు అతీగతీ లేకుండా ఉన్నాయి. పనులు ఏళ్ల కిందటే పడకేశాయి. ఐదేళ్ల వైసీపీ హయాంలో కనీస కదలిక లేకపోయింది. ఆ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. దీంతో జిల్లా రైతాంగం ఆయా ప్రాజెక్టులపై ఆశలు వదులుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక కచ్చితంగా వాటికి పూర్వవైభవం వస్తుందని నేతల నుంచి అధికారుల వరకు ప్రకటిస్తుండడంతో ఇప్పుడిప్పుడే అందరిలో నమ్మకం కలుగుతోంది. తోటపల్లి కాలువ, తారకరామతీర్థసాగర్ను పూర్తిచేస్తే జిల్లాలో అత్యధిక ప్రాంతాల దశ మారనుంది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం జిల్లాకు వస్తున్నారు. ఆయన వాటిని పరిశీలించి స్పష్టమైన హామీ ఇస్తారని రైతులు ఆశలు పెట్టుకున్నారు.
ప్రగతి పథం పట్టేనా?
జిల్లాలో పడకేసిన కీలక సాగునీటి ప్రాజెక్టుల పనులు
ఐదేళ్లలో కదలిక లేకపోయె
తారకరామతీర్థసాగర్ పనులు అత్యవసరం
నేడు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన
వ్యవసాయం ప్రధానంగా ఉన్న జిల్లాలో సాగునీటితో కళకళలాడాల్సిన కీలక ప్రాజెక్టులు అతీగతీ లేకుండా ఉన్నాయి. పనులు ఏళ్ల కిందటే పడకేశాయి. ఐదేళ్ల వైసీపీ హయాంలో కనీస కదలిక లేకపోయింది. ఆ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. దీంతో జిల్లా రైతాంగం ఆయా ప్రాజెక్టులపై ఆశలు వదులుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక కచ్చితంగా వాటికి పూర్వవైభవం వస్తుందని నేతల నుంచి అధికారుల వరకు ప్రకటిస్తుండడంతో ఇప్పుడిప్పుడే అందరిలో నమ్మకం కలుగుతోంది. తోటపల్లి కాలువ, తారకరామతీర్థసాగర్ను పూర్తిచేస్తే జిల్లాలో అత్యధిక ప్రాంతాల దశ మారనుంది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం జిల్లాకు వస్తున్నారు. ఆయన వాటిని పరిశీలించి స్పష్టమైన హామీ ఇస్తారని రైతులు ఆశలు పెట్టుకున్నారు.
విజయనగరం/ గుర్ల, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి):
తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు జిల్లాలో అత్యధిక ప్రాంతాలకు ఆధారం. ఒకవైపు ఎయిర్పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాణం పూర్తయితే ఎయిర్పోర్టు అవసరాలకు ఈ ప్రాజెక్టు నుంచే నీరివ్వాలి. విజయనగర కార్పొరేషన్ ప్రజలకు తాగునీటితో పాటు వేలాది ఎకరాలకు సాగునీరు ఇచ్చే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని జిల్లా ప్రజలు సంవత్సరాలుగా కోరుతున్నారు. గుర్ల మండలం ఆనందపురం వద్ద చంపావతి నదిలో చేపట్టిన తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టుకు 2004లో శంకుస్థాపన చేశారు. 2009లో కొన్ని నిధులు విడుదల చేశారు. ఆ తరువాత ఇంతవరకూ నిధుల జాడ లేదు. దీంతో ప్రాజెక్టు వ్యయం అమాంతం పెరిగిపోయింది. తాజాగా ప్రభుత్వం బడ్జెట్లో రూ.40 కోట్లు కేటాయించింది. ఆ నిధులు కూడా విడుదల చేయని పరిస్థితి. ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే రూ.800 కోట్లు అవసరమని ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో కలెక్టర్ అంబేడ్కర్ ప్రభుత్వానికి వివరించారు. రాష్ట్ర మంత్రి నిమ్మల రామునాయుడు జిల్లా పర్యటనలో తారక రామతీర్థసాగర్పైనే ప్రధానంగా దృష్టిసారిస్తారని తెలిసింది. ప్రాజెక్టు డీపీఆర్, ప్రస్తుత పరిస్థితి? పూర్తికావాలంటే ఎన్ని నిధులు అవసరం? తదితర వాటిపై మంత్రి సమీక్షించనున్నారు. ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతాలను మంత్రి పరిశీలించనున్నారు.
- కాలువల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఆనందపురం నుంచి ప్రధాన కాలువ ముళ్ల పొదలతో నిండిపోయింది. తుమ్మచెట్లు పెరిగిపోయి కాలువలను కప్పేశాయి. ఆనందపురం, నక్కలపేట, కోటగండ్రేడు, కలవచర్ల, గోశాడ, కెల్లా, మన్యపురిపేట, ఎస్ఎస్ఆర్.పేట తదితర గ్రామాల గుండా ఈ కాలువలు గొర్లిపేట కొండ వరకు తవ్వి వదిలేశారు. ఎస్ఎస్ఆర్.పేట వద్ద ఉన్న కొండను తవ్వి సొరంగం ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రాజెక్టు పరిసరాల్లో తుప్పు పట్టిన యంత్రాలు ఉన్నాయి. పూసపాటిరేగ మండలం కుమిలి గ్రామం వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్లో నీరు నిల్వ ఉంచడంతోపాటు అక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు నీరు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ ఏ పనులూ జరగడం లేదు.
- బొబ్బిలి ప్రాంతంలో కూడా ఇరిగేషన్ వనరులు నిర్వీర్యమయ్యాయి. గొలుసుకట్టు చెరువుల నిర్వహణను పూర్తిగా వదిలేశారు. పిరిడి ఛానల్కు సంబంధించి ఎమ్మెల్యే బేబీనాయన సొంత నిధులు ఇచ్చి మరమ్మతులు చేయడంతో గత పంట సీజన్ గట్టెక్కింది. ఈ ఏడాది కూడా కాలువల పరిస్థితి అంతే. మరోవైపు ఖరీఫ్ సమీపిస్తోంది.
మడ్డువలస పనులకు బ్రేక్
వేలాది ఎకరాలకు నీరందించే వంగర మండలంలోని మడ్డువలస జలాశయం రెండోదశ పనులకు మధ్యలోనే బ్రేక్లు పడ్డాయి. ఆయకట్టు ద్వారా సుమారు 30వేల ఎకరాలకు నీరు అందుతుంది. గత ప్రభుత్వం కాలువల ఆధునికీకరణ పనులు, ప్రధాన గేట్లకు మరమ్మతులు, ఇతరత్రా పనుల కోసం అరకొర నిధులు విడుదల చేయడంతో నేటకీ పనులు కాలేదు. గుత్తేదారునికి సక్రమంగా బిల్లులు కూడా ఇవ్వలేదు. ఆధునికీకరణ పనులు చెయ్యకపోవటంతో గేట్లు వద్ద నీరు లీకవుతోంది.
- ఆండ్ర, తాటిపూడి ప్రాజెక్టుల్లోనూ పేరుకు పోయిన పిచ్చిమొక్కలు, వ్యర్థాలు, పూడిక తీత పనులు చేయించాలని ఆయా ప్రాజెక్టుల ఆయకట్టు కింద ఉన్న రైతాంగం కోరుతోంది.
మంత్రి పర్యటన ఇలా
జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విజయనగరం జిల్లాలో మంగళవారం పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు గుర్ల మండలంలోని తారకరామ తీర్థసాగర్ స్పిల్వేను పరిశీలిస్తారు. అక్కడి నుంచి 9.30 గంటలకు బయలుదేరి కుమిలి వద్ద నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్ పనులను పరిశీలిస్తారు. ఉదయం 11 గంటలకు అక్కడి నుంచి కలెక్టరేట్కు బయలుదేరి 12 గంటలకు అధికారులతో సమీక్షిస్తారు. ఆపై మీడియాతో మాట్లాడతారు. మధ్యాహ్నం సుమారు 1.30 గంటలకు శ్రీకాకుళం జిల్లా టెక్కలికి వెళ్లనున్నారు.