Irrigation water problem సాగునీటికి గండం
ABN , Publish Date - May 31 , 2025 | 10:59 PM
Irrigation water problem ఖరీఫ్ సీజన్ వచ్చేస్తోంది. జిల్లా వ్యవసాయశాఖ ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది. రైతులు సైతం సాగుకు సన్నద్ధం అవుతున్నారు. ఈ సమయంలో అన్నదాతకు అండగా ఉండాల్సిన కాల్వలు ప్రవాహం లేక.. తర్వాతైనా నీరు వస్తుందన్న భరోసా కానరాక నిరాశ పరుస్తున్నాయి.
సాగునీటికి గండం
వైసీపీ పాపం.. రైతులకు శాపం
అధ్వానంగా తోటపల్లి కాల్వలు, సారధిగెడ్డ
సాగునీటి ప్రవాహం ప్రశ్నార్థకం
సమీపిస్తున్న ఖరీఫ్ సీజన్
ఖరీఫ్ సీజన్ వచ్చేస్తోంది. జిల్లా వ్యవసాయశాఖ ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది. రైతులు సైతం సాగుకు సన్నద్ధం అవుతున్నారు. ఈ సమయంలో అన్నదాతకు అండగా ఉండాల్సిన కాల్వలు ప్రవాహం లేక.. తర్వాతైనా నీరు వస్తుందన్న భరోసా కానరాక నిరాశ పరుస్తున్నాయి. పొదలు, వ్యర్థాలతో దర్శనమిస్తున్నాయి. అధికారులు తోటపల్లి నీటిని విడుదల చేసినా శివారు ఆయకట్టు వరకూ సాగునీరు ప్రవహిస్తుందన్న నమ్మకం అన్నదాతలో లేదు. పంట కాల్వల్లో పేరుకుపోయిన వ్యర్థాలను, పిచ్చిమొక్కల్ని తొలగించే దిశగా అధికారులూ యోచించడం లేదు. ఈ ప్రభావం దిగుబడిపై పడుతోంది.
రాజాం రూరల్, మే 31(ఆంధ్రజ్యోతి):
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అధికారికంగా 1.20 లక్షల ఎకరాలకు, అనధికారికంగా సుమారు 50 వేల ఎకరాలకు ఆ సాగునీరందించే లక్ష్యంతో తోటపల్లి ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన రెండు కాల్వల నుంచి రాజాం నియోజకవర్గంతో పాటు శ్రీకుళం జిల్లాలోని జి.సిగడాం, పొందూరు, ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం తదితర మండలాలకు సాగునీరు సరఫరా అవుతోంది. అయితే ప్రాజెక్టు కాల్వలు అధ్వానంగా మారాయి. కిలోమీటర్ల మేర వ్యర్థాలు, పిచ్చిమొక్కలు పేరుకుపోయాయి. గత ప్రభుత్వం సాగునీటి రంగాన్ని పూర్తిగా విస్మరించడంతో ఈ పరిస్థితి నెలకొంది. శివారు ప్రాంతాలకు సకాలంలో నీరు చేరడం లేదు. సాగునీటి సరఫరాలో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది.
- తెర్లాం మండలం నుంచి అరసబలగ, రాజాం మండలం కంచరాం, గడిముడిదాం, రేగిడి మండలంలోని వ్యవసాయ భూములకు సాగునీరందించే కాల్వ 52.450 కిలోమీటర్ల నుంచి 117.890 కిలోమీటర్ల వరకూ ఇదే దుస్థితి కనిపిస్తోంది. అలాగే రెండోమార్గంలో తెర్లాం మీదుగా రాజాం మండలం ఎం.జె.వలస, బి.ఎన్.వలస, గెడ్డవలస, బొద్దాం, సోపేరు మీదుగా శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడాం, రణస్థలం, లావేరు తదితర మండలాల రైతాంగానికి సాగునీరందించే కాల్వదీ ఇదే దుస్థితి. వ్యర్థాలు పేరకుపోయాయి. పిచ్చిమొక్కలు, గడ్డి పెరిగిపోయింది.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం
వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలతో పాటు అత్యంత ప్రాధాన్యత కలిగిన సాగునీటి వ్యవస్థనూ నిర్వీర్యం చేసింది. కాల్వల మరమ్మతులు, అధునికీకరణ, లైనింగ్ పనుల కోసం ఒక్కరూపాయి కూడా విదల్చలేదు. దీంతో రైతాంగానికి అయిదేళ్లూ అవస్థలు తప్పలేదు. వర్షాధారంపై ఆధారపడే రైతులు చెరువులు, నేలబావుల్లోని నీటిని ఆయిల్ ఇంజన్లతో తోడుతూ సాగు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
కాల్వల్లోకి వ్యర్థాలు
తోటపల్లి కాల్వలను ఆనుకుని ఉన్న గ్రామాలకు చెందిన ప్రజలు వ్యర్థాలను కాల్వల్లో పారబోస్తున్నారు. దీనివల్ల కూడా సాగునీటి ప్రవాహవేగం మందగిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో సాగునీటి వనరుల అభివృద్ధికి నిధులు మంజూరు కాలేదని, ప్రస్తుతం కాల్వల పరిస్థితిపై నివేదిక తయారుచేసి నిధుల కోసం ప్రతిపాదనలు పంపించినట్లు తోటపల్లి ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. కాల్వల్లో వ్యర్థాలు వేయకుండా కాల్వల సమీప పంచాయతీల ప్రజాప్రతినిధులు సహకరించాలని ప్రాజెక్టు అఽధికారులు కోరుతున్నారు.
పిచ్చిమొక్కలతో సారధిగెడ్డ
ఐదు మండలాల పరిధిలో సుమారు 30 వేల ఎకరాలకు సాగునీరందించే సారధిగెడ్డ నానాటికీ కుచించుకుపోతోంది. పిచ్చిమొక్కలతో నిండిపోయి సాగునీటి ప్రవాహానికి వీల్లేని విధంగా మారుతోంది. తెర్లాం మండలంలో మిగులు జలాలు రాజాం మండలంలోని పలు గ్రామాల చెరువులను నింపుతూ సారధిగెడ్డలో చేరుతున్నాయి. గెడ్డను ఆనుకుని ఉన్న భూములను సస్యశ్యామలం చేస్తూ శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడాం మండలం వరకు ప్రవహిస్తూ ఆపై పొందూరు మండలంలోని రెల్లిగెడ్డలో చేరుతోంది. సుమారు 50 కిలోమీటర్ల మేర నీటి గళగళలతో ముందుకు సాగే సారధిగెడ్డను బాగుచేయించి, ఆక్రమణలు తొలగించాల్సిన గత ప్రభుత్వం ఆ దిశగా కనీస అడుగులు వేయలేదు. ఈ ప్రభుత్వం పూర్వవైభవం తేవాలని రైతులు కోరుతున్నారు.