Insurance with support బీమాతో ధీమా
ABN , Publish Date - Sep 30 , 2025 | 12:01 AM
Insurance with support గ్రామీణ ప్రాంత ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా ఆరు రకాల బీమా పథకాలను కొత్తగా తీసుకొచ్చింది. తక్కువ ప్రీమియం ఎక్కువ బోనస్లతో పాలసీదారులకు భరోసా ఇస్తోంది. సురక్ష, సువిధ, సుమంగళ్, సంతోష్, గ్రామప్రియ, చిల్డ్రన్ పాలసీ పేర్లతో ఆరు పథకాలను ప్రవేశపెట్టింది. ఒక్కో పథకం ద్వారా రూ.10వేల నుంచి రూ.10 లక్షల వరకు పాలసీ తీసుకునే అవకాశం కల్పించింది
బీమాతో ధీమా
ఆరు కొత్త పథకాలను ప్రవేశపెట్టిన తపాలాశాఖ
గ్రామీణ ప్రజలకు మరింత ప్రయోజనం
తక్కువ ప్రీమియం.. ఎక్కువ బోనస్కు అవకాశం
గజపతినగరం, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంత ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా ఆరు రకాల బీమా పథకాలను కొత్తగా తీసుకొచ్చింది. తక్కువ ప్రీమియం ఎక్కువ బోనస్లతో పాలసీదారులకు భరోసా ఇస్తోంది. సురక్ష, సువిధ, సుమంగళ్, సంతోష్, గ్రామప్రియ, చిల్డ్రన్ పాలసీ పేర్లతో ఆరు పథకాలను ప్రవేశపెట్టింది. ఒక్కో పథకం ద్వారా రూ.10వేల నుంచి రూ.10 లక్షల వరకు పాలసీ తీసుకునే అవకాశం కల్పించింది. లబ్ధిదారుడు మూడేళ్లపాటు జరిపిన చెల్లింపులపై రుణ సదుపాయం కూడా కల్పించనుంది. ప్రీమియం చెల్లిస్తున్న సమయంలో పాలసీదారుడు మృతిచెందితే చెల్లించిన పాలసీ మొత్తాన్ని ఒకేసారి నామినీకి అందజేస్తారు. ఈపథకాల్లో చేరదలిచిన వారికి ఆధార్తో పాటు పాన్కార్డు ఉండాలి. జిల్లాలో ఏపోస్టాఫీసులో అయినా ప్రీమియం చెల్లించవచ్చు. ఆదాయపు పన్ను రాయితీ, నామినేషన్ సదుపాయం, ఆన్లైన్లో ప్రీమియం చెల్లించే అవకాశాన్ని తపాలశాఖ కల్పించింది. గతంలో పాలసీదారులపై జీఎస్టీ ప్రభావం ఉండేది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో జీఎస్టీ లేకుండా ప్రీమియం కట్టుకోవచ్చు.
సంతోష్ పాలసీ ఇలా..
సంతోష్ పథకం కింద రూ.10వేల నుంచి రూ.10లక్షల వరకు పాలసీ తీసుకోవచ్చు. 19నుంచి 55మధ్య వయస్కులు అర్హులు. బోనస్ కింద రూ,1000కి రూ.48 వర్తిస్తుంది. 19ఏళ్ల వ్యక్తి ఈ పథకంలో చేరితే మెచ్యూరిటీని 35, 40, 45, 50, 55, 58, 60 ఏళ్లలో ఏదో ఒక ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. మెచ్యూరిటీ ఏ సంవత్సరం వరకు అయితే నిర్ణయించుకుంటారో ఆ సంవత్సరం నుంచి మరో ఐదేళ్లపాటు వేచి ఉండాల్సి ఉంటుంది. అనంతరం పాలసీ మొత్తానికి బోనస్ జోడించి లబ్ధిదారుడికి అందజేస్తారు. రూ.10లక్షలు పాలసీ చేసిన లబ్ధిదారుడికి బోనస్తో కలిపి మొత్తం రూ.29.68 లక్షలు అందుతుంది.
సురక్ష పథకం ఇలా..
సురక్ష పథకం కింద రూ.10వేలు నుంచి రూ.10లక్షల వరకు పాలసీ నిర్ణయించారు. బోనస్ కింద రూ.1000కి రూ.60వర్తిస్తుంది. వయసు 60 సంవత్సరాలు వచ్చే వరకు ప్రీమియం చెల్లించాలి. రూ.10లక్షల పాలసీదారు 60వ సంవత్సరం వరకు చెల్లిస్తే బోనస్తో కలిపి దాదాపు రూ.34.60లక్షలు అందజేస్తారు. పాలసీ ప్రారంభించాక మూడేళ్ల తరువాత నుంచి పాలసీదారుడుకి రుణ సదుపాయం కూడా ఉంటుంది.
గ్రామప్రియ పాలసీ ఇలా..
ఈ పథకంలో 10 సంవత్సరాల పాలసీ మాత్రమే నిర్ణయించారు. ఇందులో 20నుంచి 40 సంవత్సరాల వయసు వారిని అర్హులుగా చేర్చారు. 10 సంవత్సరాల తర్వాత పాలసీలో మనీబ్యాక్ కింద నిర్దేశించిన సమయంలో 20శాతం బోనస్ లభిస్తుంది. మిగిలిన మొత్తాన్ని పాలసీ ముగిసే సమయంలో బోనస్ను జోడించి అందించనున్నారు.
సువిధ పథకం ఇలా..
సువిధ పథకం కింద రూ.10 వేలనుంచి రూ.10లక్షల వరకు పాలసీ నిర్ణయించారు. 19నుంచి 45సంవత్సరాల మధ్య వయస్కులు అర్హులు. ఈ పాలసీని 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు తీసుకోవచ్చు. లేదంటే కన్వర్ట్ చేసుకొనే అవకాశం కూడా కల్పించారు. సువిధ పథకం కింద ప్రీమియం చెల్లింపులు ఐదేళ్లపాటు చేయాలి. ప్రీమియం బట్టి బోనస్ ఉంటుంది.
సుమంగళ్ పాలసీ ఇలా..
ఈ పాలసీకి 19నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్కులు అర్హులు. ఈ పథకంలో రెండురకాల బోనస్ను నిర్ణయించారు. 15సంవత్సరాల పాలసీని ఎంచుకున్న లబ్ధిదారుడికి మనీబ్యాక్ కింద వరుసగా 6, 9, 12 సంవత్సరాలు అయినప్పుడు బోనస్ లభించనుంది. అలాగే వరుసగా 8, 12, 16 అయినప్పుడు 20శాతం చొప్పున మనీబ్యాక్ రూపంలో బోనస్ లభిస్తుంది. ఈపథకంలోఎలాంటి రుణసదుపాయం ఉండదు.
పిల్లల పాలసీ ఇలా..
ఈపాలసీలో చేరే పిల్లాడికి సంబంధించి తల్లిదండ్రులు సురక్ష, సువిధ పథకాల్లో లబ్ధిదారులై ఉండాలి. అది కూడా తల్లిదండ్రుల వయసు 45ఏళ్ల లోపు ఉండాలి. 5నుంచి 20ఏళ్లలోపు ఉన్నపిల్లలకు ఈ పాలసీ వర్తిస్తుంది. ఈ పథకంలో రూ.20వేల నుంచి రూ.లక్ష వరకు పాలసీ ప్రీమియాన్ని నిర్ణయించారు.
కొత్త పాలసీలపై అవగాహన కల్పిస్తున్నాం
పోస్టల్ శాఖలో అమలు చేస్తున్న కొత్త పాలసీలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. గ్రామాల్లో ఇటీవల మెగా క్యాంపులు నిర్వహించి సబ్ డివిజన్ పరిధిలో అనేక పాలసీలు చేశారు. గతంలో పాలసీలు కట్టే లబ్ధిదారుడిపై జీఎస్టీ ప్రభావం ఉండేది. ప్రసుత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎటువంటి జీఎస్టీ లేకుండా లబ్ధిదారులు పాలసీ తీసుకోవచ్చు.
- బి.ఉపేంద్ర, పోస్టల్ ఇన్స్పెక్టర్, గజపతినగరం సబ్ డివిజన్
----------------