Dangerous! అప్రమత్తంగా లేకుంటే ప్రమాదమే!
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:20 AM
If Not Vigilant, It Can Be Dangerous! జిల్లాలో ఇప్పుడిప్పుడే వరి నూర్పుడి యంత్రాల వినియోగం పెరుగుతోంది. కూలీల కొరత వేధిస్తున్న నేపఽథ్యంలో రైతులు యాంత్రీకరణ వైపు అడుగులు వేస్తున్నారు. వరి నూర్పులతో పని సులువైనా.. అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి.
వరినూర్పిడి యంత్రాల తరలింపులో జాగ్రత్తలు తప్పనిసరి
పాలకొండ, డిసెంబరు21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇప్పుడిప్పుడే వరి నూర్పుడి యంత్రాల వినియోగం పెరుగుతోంది. కూలీల కొరత వేధిస్తున్న నేపఽథ్యంలో రైతులు యాంత్రీకరణ వైపు అడుగులు వేస్తున్నారు. వరి నూర్పులతో పని సులువైనా.. అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. 2024లో పాలకొండ మండలంలో వరి నూర్పుడి యంత్రాన్ని పొలం గట్లుపై నుంచి దించే క్రమంలో అది తిరగబడింది. దానిపై కూర్చొన్న వ్యక్తి మృత్యువాత పడ్డాడు. గత ఏడాది వీరఘట్టం మండలంలో రోడ్డు బాగోలేక వరి నూర్పుడి యంత్రం బోల్తా పడింది. దీంతో వ్యవసాయ మహిళా కూలీ మరణించింది. ఇటువంటి ఘటనలు తరచూ సంభవిస్తున్న నేపథ్యంలో పంట నూర్పుడి యంత్రాన్ని పొలానికి తరలించే క్రమంలో రైతులు, వ్యవసాయ కూలీలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా ఈనెలతో పాటు, జనవరిలో వరి నూర్పులు అధికంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో యంత్రంతో పాటు పొలంలోకి వెళ్లేటప్పుడు డ్రైవర్లు కూడా దారి సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. ఒకేసారి ఎత్తయిన గట్టు నుంచి వాహనం దించకుండా చూడాలి. రహదారికి ఆనుకుని పంట పొలాల్లో వేలాడుతుండే విద్యుత్ తీగలను గమనించాలి. యంత్రాలపై వ్యవసాయ కూలీలు కూర్చోరాదు. యంత్రానికి దూరంగా ఉండడం మంచిది. వరి కోత యంత్రంలోకి వరి పనాలను వేసేటప్పుడు పూర్తిస్థాయిలో చేయి పెట్టరాదని పాలకొండ మండల వ్యవసాయ శాఖాధికారి ప్రసాదరావు సూచించారు. రైతులు అప్రమత్తంగా ఉంటూ వ్యవసాయ పనులు పూర్తి చేయాలన్నారు.