how to treatment వైద్యం ఎలా?
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:24 PM
how to treatment జిల్లాలో సీజన్లవారీగా వ్యాధులు ముసురుకుంటున్నాయి. వైరల్ జ్వరాలు, దగ్గు, జలుబు వంటి వాటితో అనేక మంది ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో డయేరియా, పచ్చకామెర్లు వంటివి సోకుతున్నాయి. ఈ సమయంలో ప్రజలు సీహెచ్సీలు, ప్రాంతీయ ఆస్పత్రుల వైపు చూస్తున్నారు. కానీ అక్కడ వైద్యులు, సిబ్బంది కొరత ఉండడంతో వైద్యసేవలు సంతృప్తిగా పొందలేకపోతున్నారు. ప్రధానంగా వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న 12 ఆస్పత్రుల్లో సిబ్బంది పూర్తిస్థాయిలో లేరు. ఉన్న సిబ్బందికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. పనిభారం పడుతోంది.
వైద్యం ఎలా?
12 ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత
ఉన్నవారిపై పనిభారం
రోగులకు అంతంతమాత్రంగా సేవలు
రాజాం, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో సీజన్లవారీగా వ్యాధులు ముసురుకుంటున్నాయి. వైరల్ జ్వరాలు, దగ్గు, జలుబు వంటి వాటితో అనేక మంది ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో డయేరియా, పచ్చకామెర్లు వంటివి సోకుతున్నాయి. ఈ సమయంలో ప్రజలు సీహెచ్సీలు, ప్రాంతీయ ఆస్పత్రుల వైపు చూస్తున్నారు. కానీ అక్కడ వైద్యులు, సిబ్బంది కొరత ఉండడంతో వైద్యసేవలు సంతృప్తిగా పొందలేకపోతున్నారు. ప్రధానంగా వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న 12 ఆస్పత్రుల్లో సిబ్బంది పూర్తిస్థాయిలో లేరు. ఉన్న సిబ్బందికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. పనిభారం పడుతోంది.
ఉమ్మడి జిల్లాలో వైద్య విధాన పరిషత్ పరిధిలో పార్వతీపురం, ఎస్.కోట, సాలూరు, రాజాం, పాలకొండ ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. వీటితో పాటు గజపతినగరం, బాడంగి, భోగాపురం, నెల్లిమర్ల, చీపురుపల్లి, బొబ్బిలి, కురుపాం, భద్రగిరి, చినమేరంగి సీహెచ్సీలు ఉన్నాయి. అయితే ఈ ఆస్పత్రుల పరిధిలో 198 మంది వైద్యులు ఉండాలి. కానీ ఉన్నది కేవలం 168 మంది మాత్రమే. దీంతో 30 మంది వైద్యుల కొరత ఉంది. అయితే ఉన్న వైద్యుల్లో సైతం ఉన్నత చదువులు, మహిళా వైద్యులు వివిధ అవసరాల కోసం దీర్ఘకాలిక సెలవులపై ఉన్నారు. దీంతో ఉన్న కొద్దిపాటి మందిపై భారం పడుతోంది. రోగుల వైద్యసేవలపై ప్రభావం చూపుతోంది. ప్రధానంగా ఈఎన్టీ, సైకాలజీ, పిడియాట్రిక్, రేడియాలజీ, ఫోరెన్సిక్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థో, గైనకాలజీ, అప్తాలమిక్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మత్తు వైద్యుల కొరత సైతం వేధిస్తోంది. దీంతో ఆపరేషన్లు, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సమయంలో ఇతర ఆస్పత్రుల నుంచి మత్తు వైద్యులను తెప్పించుకోవాల్సి వస్తోంది.
పారా మెడికల్ సిబ్బంది సైతం..
ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులతో పాటు ఇతర సిబ్బందిదీ కీలక పాత్ర. పారా మెడికల్ సిబ్బంది ఉంటేనే రోగులకు సక్రమంగా వైద్యసేవలందుతాయి. కానీ కొన్నేళ్లుగా పారా మెడికల్ సిబ్బంది నియామకం చేపట్టలేదు. దీంతో ప్రతి ఆస్పత్రిలో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని వైద్యవిధాన పరిషత్లోని ఈ ఆస్పత్రుల్లో 350 మంది సిబ్బంది అవసరం. కానీ ఉన్నది కేవలం 298 మంది మాత్రమే. అందులోనూ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది మాత్రమే ఉన్నారు. రెగ్యులర్ సిబ్బంది చాలా తక్కువగా ఉన్నారు. రేడియోగ్రాఫర్, సూపర్వైజర్, ఫార్మసీ సూపర్వైజర్ గ్రేడ్-1, గ్రేడ్-2, థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, డార్క్ రూమ్ అసిస్టెంట్, మెడిసిన్, బయో మెడికల్ ఇంజనీర్, థెరఫిస్టు, ల్యాబ్ అటెండెంట్, రికార్డ్ అసిస్టెంట్స్, ఆఫీస్ అడ్మినిస్ర్టేటివ్ స్టాఫ్ వంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు..
ఇవి పేరుకే 24 గంటల ఆస్పత్రులు కానీ.. సాయంత్రం 4 గంటల తరువాత వైద్యసేవలు అందడం గగనమే. అత్యవసర, అనారోగ్య సమయాల్లో రాత్రిపూట వైద్యసేవల కోసం వచ్చేవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. అక్కడ పలకరించేవారుండరు. వీలైనంత వరకూ రిఫరల్కే అక్కడ సిబ్బంది మొగ్గుచూపుతున్నారు. సిబ్బంది, వైద్యులు ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. కొందరు వైద్యులు ఓపీ చూశాక సమీక్షలు, సమావేశాల పేరిట జిల్లా కేంద్రాలకు వెళ్తున్నారు. ఫీల్డ్ విధులకు కూడా వెళుతుంటారు. స్థానికంగా నివాసముండే వారు చాలా తక్కువ. అత్యవసర సమయాల్లో వైద్యులు అందుబాటులో ఉండక రోగులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.
కొరత వాస్తవమే..
కొన్ని ఆస్పత్రుల్లో వైద్యుల కొరత ఉన్నమాట వాస్తవమే. ఉన్నవారితో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం. పారా మెడికల్ సిబ్బంది కొరతను సైతం అధిగమిస్తున్నాం. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాం. త్వరలో పెండింగ్ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది.
- జీవనరాణి, డీఎంహెచ్వో, విజయనగరం