Hospitals 100 నుంచి 300 పడకలతో ఆసుపత్రులు
ABN , Publish Date - Apr 07 , 2025 | 11:31 PM
Hospitals with 100 to 300 beds జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆసుపత్రుల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. వైద్యం, ఆరోగ్యం తదితర అంశాలపై సోమవారం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
పార్వతీపురం, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆసుపత్రుల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. వైద్యం, ఆరోగ్యం తదితర అంశాలపై సోమవారం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పార్వతీపురంలో ప్రస్తుతం 100 పడకల ఆసుపత్రి ఉండగా మరో సూపర్స్పెషాలిటీ ఆసుపత్రిలో నిర్మాణం ఉంది. అదే విధంగా పాలకొండ ఏరియా ఆసుపత్రితో పాటు సీతంపేటలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంలో ఉంది. సాలూరు ఏరియా ఆసుపత్రిలో వంద పడకలు ఏర్పాటు చేస్తాం. కురుపాం కేంద్రంగా వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు కానుంది. ’ అని తెలిపారు. జిల్లాలో హైపర్ టెన్షన్తో 39,828 మంది, షుగర్తో 13,426 మంది, బీపీ, షుగర్ కలిపి 22,922 మంది ఉన్నట్టు ముఖ్యమంత్రి వివరించారు. జిల్లాకు చెందిన 2211 మంది క్యాన్సర్ రోగులు, కాలేయం బాధితులు 615 మంది, కార్డియోకు సంబంధించి 3,633 మంది ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యసేవలు పొందినట్టు వెల్లడించారు. డెంగ్యూ, మలేరియా వ్యాధులు ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా ఉన్నట్టు నివేదికలో గుర్తించారు. ఆహారపు అలవాట్లు, జీవన విధానం మార్చుకోవడం ద్వారా రోగాలకు దూరంగా ఉండొచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు.