High alert: తీరంలో హైఅలర్ట్
ABN , Publish Date - May 09 , 2025 | 11:44 PM
High alert: పాకిస్థాన్తో యుద్ధం నేపథ్యంలో జిల్లాలోని తీర ప్రాంతాల్లో హైఅలర్ట్ నడుస్తోంది.

- ముష్కరులు ప్రవేశించకుండా భద్రత కట్టుదిట్టం
- డ్రోన్లతో నిఘా
- కొత్తవారు కనిపిస్తే సమాచారం ఇవ్వాలంటున్న పోలీసులు
పూసపాటిరేగ, మే9(ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్తో యుద్ధం నేపథ్యంలో జిల్లాలోని తీర ప్రాంతాల్లో హైఅలర్ట్ నడుస్తోంది. సముద్ర మార్గం గుండా ఉగ్రవాదులు ప్రవేశించకుండా మెరైన్, స్థానిక పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. డ్రోన్లతో నిఘా పెడుతున్నారు. ఎస్పీ జిందాల్ ఆదేశాల మేరకు శుక్రవారం చింతపల్లి, తిప్పలవలస, తమ్మయ్యపాలెం తదితర తీర ప్రాంతాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. చింతపల్లిలోని లైట్హౌస్ వద్ద డాగ్స్క్వాడ్ సహాయంతో జల్లెడ పట్టారు. రహదారుల కూడళ్ల వద్ద ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నారు. తీర గ్రామాల్లో సమావేశాలను ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే మెరైన్, పోలీసుశాఖకు సమాచారం అందజేయాలని సీఐ రామకృష్ణ, ఎస్ఐ దుర్గాప్రసాద్ కోరారు.
జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు
విజయనగరం క్రైం, మే 9(ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్తో యుద్ధం జరుగుతుండడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. గత వారం రోజుల నుంచి లాడ్జీలు, హోటళ్లు, రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ కాంప్లెక్స్ల్లో తనిఖీలు నిర్వహించి నిఘాను పెంచారు. రాత్రి పూట వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నారు. అనుమానితుల నుంచి వివరాలను సేకరిస్తున్నారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 14 రైల్వే స్టేషన్లు, 55 ప్రాంతాల్లో 91 లాడ్జీలు, రైల్వే ఫ్లాట్ఫాంలు, రెస్ట్రూంలు, పార్శిల్ కార్యాలయాలను అనువణువూ పరిశీలించారు. డీఎస్పీలు శ్రీనివాసరావు, భవ్యరెడ్డి, రాఘవులు పర్యవేక్షించారు.