Health with Yoga యోగాతో ఆరోగ్యం
ABN , Publish Date - Jun 21 , 2025 | 11:58 PM
Health with Yoga యోగా సాధన ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని, యోగాతోనే ఆరోగ్యంగా ఉంటామని కలెక్టర్ బీఅర్ అంబేడ్కర్ అన్నారు. నగరంలోని రాజీవ్ క్రీడాప్రాంగణంలో ఐదు వేల మందితో యోగాసనాలు వేయగా జిల్లాలో 5,775 కేంద్రాల్లో యోగా ప్రదర్శనలు శనివారం ఏర్పాటు చేశారు.
యోగాతో ఆరోగ్యం
కలెక్టర్ అంబేడ్కర్
5 వేల మంది సాధకులతో, 5,775 కేంద్రాల్లో ఘనంగా యోగా దినోత్సవం
విజయనగరం, జూన్ 21(ఆంధ్రజ్యోతి): యోగా సాధన ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని, యోగాతోనే ఆరోగ్యంగా ఉంటామని కలెక్టర్ బీఅర్ అంబేడ్కర్ అన్నారు. నగరంలోని రాజీవ్ క్రీడాప్రాంగణంలో ఐదు వేల మందితో యోగాసనాలు వేయగా జిల్లాలో 5,775 కేంద్రాల్లో యోగా ప్రదర్శనలు శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల రోజుల పాటు జిల్లాలో యోగాంధ్రలో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టామని, అందుకు సహకరించిన ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. విశాఖపట్నంలో జరిగిన యోగా కార్యక్రమానికి జిల్లా నుంచి 31 వేల మందిని పంపామని తెలిపారు. జిల్లాలో 5,775 కేంద్రాల్లో 9 లక్షల మంది యోగా సాధకులతో యోగాసనాలు వేయించడం ఆనందదాయకమన్నారు. పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల్లోనూ యోగా చేపట్టామని, మే 30న రామనారాయణం వద్ద 1,500తో జూన్ 6న చింతపల్లి బీచ్ వద్ద 1,500 మందితోనూ, రామతీర్థం దేవస్థానం వద్ద ఈ నెల 12న 1,200 మందితోనూ, తాటిపూడి రిజర్వాయరు వద్ద 1,500 మందితో యోగాసనాలు వేయించామన్నారు. ఏడు వేల మంది ఉపాధి వేతనదారులతో ఎస్కోటలో ప్రత్యేకంగా యోగా కార్యక్రమం చేపట్టామన్నారు. అంతకుముందు యోగా కోసం ప్రతి రోజు సమయం కేటాయిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఆర్వో శ్రీనివాసమూర్తి, ఆర్డీవో సవరమ్మ, డీఆర్డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి, సీపీఓ బాలాజీ, సీఈఓ సత్యనారాయణ, డ్వామా పీడీ శారదాదేవి, నగరపాలక సంస్థ కమిషనర్ పి.నల్లనయ్య, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, క్రీడాకారులు, యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.