Happy Milad-un-Nabi! వైభవంగా మిలాద్ ఉన్ నబి
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:15 AM
Happy Milad-un-Nabi! జిల్లా వ్యాప్తంగా ముస్లింలు శుక్రవారం మిలాద్-ఉన్-నబి పర్వదినాన్ని వైభవంగా జరుపుకున్నారు. ప్రముఖ మసీదుల్లో ప్రత్యేక నమాజ్లు చేశారు. ఇస్లాం మత స్థాపకుడైన మహ్మాద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పర్వదినాన్ని ముస్లింలు ఏటా నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా మసీదుల్లో మహ్మాద్ ప్రవకర్త, ఆయన చేసిన త్యాగాలు, సేవలను ఇమామ్లు ముస్లింలకు వివరించారు. మహ్మాద్ ప్రవక్త బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఆయన బోధనలను ఈ పర్వదినాన ముస్లింలు ఆచరించారు.
వైభవంగా మిలాద్ ఉన్ నబి
నగరంలో ముస్లింల శాంతి ర్యాలీ
విజయనగరం రూరల్, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ముస్లింలు శుక్రవారం మిలాద్-ఉన్-నబి పర్వదినాన్ని వైభవంగా జరుపుకున్నారు. ప్రముఖ మసీదుల్లో ప్రత్యేక నమాజ్లు చేశారు. ఇస్లాం మత స్థాపకుడైన మహ్మాద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పర్వదినాన్ని ముస్లింలు ఏటా నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా మసీదుల్లో మహ్మాద్ ప్రవకర్త, ఆయన చేసిన త్యాగాలు, సేవలను ఇమామ్లు ముస్లింలకు వివరించారు. మహ్మాద్ ప్రవక్త బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఆయన బోధనలను ఈ పర్వదినాన ముస్లింలు ఆచరించారు. విజయనగరం, బొబ్బిలి, ఎస్.కోట, గజపతినగరం, రాజాం, గంట్యాడ, నెల్లిమర్ల, గరివిడి, చీపురుపల్లి, జామి తదితర ప్రాంతాల్లోనూ మిలాద్-ఉన్-నబీ వైభవంగా జరిగింది. విజయనగరంలోని అబాద్వీధి, బాబామెట్ట, అంబటిసత్తర్వు, కంటోన్మెంట్, డక్కిన వీధితో పాటు పలు ప్రాంతాల్లో వున్న ముస్లింలు ఈ పండగను ఎంతో వైభవంగా నిర్వహించుకున్నారు. ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అబాద్వీధిలో ప్రారంభమైంది. మహిళలు, పురుషులు, ముఖ్యంగా యువతీ, యువకులు, చిన్నారులు సాంప్రదాయ దుస్తులు ధరించారు. కొంతమంది మోటారుసైకిళ్లు, మరికొంత మంది నడుస్తూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ ఆసాంతం మహ్మాద్ ప్రవక్తపై రచించిన గీతాలను ఆలపిస్తూ ముస్లింలు ముందుకు సాగారు. అబాద్వీఽధిలో ప్రారంభమైన ర్యాలీ అంబటిసత్తర్వు, మూడులాంతర్ల జంక్షన్, కోట, సింహాచలం మేడ, అంబేడ్కర్ జంక్షన్, ట్యాంకుబండు రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్, మయూరి కూడలి, రైల్వే స్టేషన్ రోడ్డు, వైఎస్సార్ జంక్షన్, ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ మీదుగా కన్యకాపరమేశ్వరీ ఆలయం, గంటస్తంభం మీదుగా మూడులాంతర్ల వద్దనున్న మసీదుకు చేరుకుంది. అనంతరం అక్కడ అంతా సమావేశమై పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
- ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూశారు. ఎస్బీ పోలీసుల సమాచారంతో ర్యాలీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. సీఐలు ఆర్వీఆర్కె చౌదరి, పి.శ్రీనివాసరావు, సూరినాయుడు, పలువురు ఎస్ఐలు పర్యవేక్షించారు.