Panchayats పంచాయతీల పునర్ వర్గీకరణకు గ్రీన్సిగ్నల్
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:23 AM
Green Signal for Reclassification of Panchayats కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ ఉద్యోగులకు తీపికబురు అందించింది. పదోన్నతులతో పాటు పంచాయతీల పునర్వర్గీకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పది రకాల సంస్కరణలకు ఆమోదం తెలిపింది. పంచాయతీలను నాలుగు గ్రేడులుగా విభజించి ఈశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించనున్నారు.
నాలుగు కేటగిరీలుగా విభజన
వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం
ప్రభుత్వ నిర్ణయంపై హర్షం
సీతంపేట రూరల్, అక్టోబరు13(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ ఉద్యోగులకు తీపికబురు అందించింది. పదోన్నతులతో పాటు పంచాయతీల పునర్వర్గీకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పది రకాల సంస్కరణలకు ఆమోదం తెలిపింది. పంచాయతీలను నాలుగు గ్రేడులుగా విభజించి ఈశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించనున్నారు. తాజాగా మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో గత 48ఏళ్లుగా పదోన్నతులకు దూరంగా ఉన్న వారు ప్రమోషన్లు పొందనున్నారు. కాగా గ్రామ పంచాయతీలను జనాభా, వార్షిక ఆదాయాన్ని ఆధా రంగా చేసుకొని మార్పులు చేయనున్నారు. మైదాన ప్రాంతాల్లో 10వేల జనాభా కంటే ఎక్కువ మంది ఉన్న పట్టణాలను స్పెషల్ గ్రేడ్ కింద మార్పుచేయనున్నారు. ఏజెన్సీలో ఐదువేల కంటే ఎక్కువ జనాభా ఉంటే స్పెషల్ గ్రేడ్గా పరిగణిస్తారు. పంచాయతీ పునర్వర్గీకరణలో భాగంగా ఇకపై గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3లుగా విభజించి పాలన అందించనున్నారు. ఇంతవరకు పంచాయతీ కార్యదర్శులుగా విధులు నిర్వహిస్తున్న వారు ఇకపై పంచాయతీ అభివృద్థి అధికా రులుగా వ్యవహరించనున్నారు. కాగా జిల్లాలోని 15మండలాల్లో 451 గ్రామ పంచాయతీల పరిధిలో 312 సచివాలయాలు ఉన్నాయి. అన్ని గ్రేడ్ల కార్యదర్శులు సుమారు 451 మంది వరకూ ఉన్నారు. వీరు కాకుండా మిగిలిన పీఆర్ శాఖ ఉద్యోగులు 243 మంది ఉన్నారు. పంచాయతీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వీరిని ఇక నుంచి గ్రేడ్-1,గ్రేడ్-2,గ్రేడ్-3లుగా విభజించనున్నారు. పట్టణాలు, మున్సి పాలిటీల తరహాలో గ్రామీణ ప్రణాళిక, ఇంజనీరింగ్, రెవెన్యూ, తాగునీరు, వీధిలైట్లు, పారిశుధ్యం తదితర విభాగాలుగా విభజించి పంచాయతీల్లో పాలన అందించనున్నారు.
ఆనందంగా ఉంది..
ఎన్నో ఏళ్ల తర్వాత పంచాయతీరాజ్ శాఖలో ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. మాకెంతో ఆనందంగా ఉంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కార్యదర్శులకు గౌరవం పెరుగుతుంది, మాపై కూడా మరింత బాధ్యత పెరిగింది.
- బి.రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి, సీతంపేట
=================================
శుభపరిణామం
పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడం అనేది శుభ పరిణామం. ఐదు దశాబ్దాల తరువాత పంచాయతీలను ప్రభుత్వం గ్రేడ్లుగా విభజించి ఉద్యోగుల ప్రమోషన్లకు మార్గం సుగమం చేయడం గొప్ప విషయం. ఈ ప్రక్రియ వేగవంతం చేస్తే బావుంటుందనే అభ్రిపాయాన్ని వ్యక్తం చేసారు.
- కామేశ్వరరావు, ఏపీపీఎస్సీ రాష్ట్ర సెక్రటరీల ఫెడరేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి