Storage and Distribution – How? సరుకుల నిల్వ .. పంపిణీ ఎలా?
ABN , Publish Date - Jun 04 , 2025 | 12:15 AM
Goods Storage and Distribution – How? రేషన్ డిపోల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ నెల ఒకటో తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా చౌక ధరల దుకాణాల వద్ద కార్డుదారులకు సరుకులు అందిస్తున్నారు. అయితే పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో చాలావరకు జీసీసీ డీఆర్ డిపోల భవనాలు శిఽథిలావస్థకు చేరుకున్నాయి.
కొన్నింటికి కనీస మరమ్మతులు కరువు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో సిబ్బంది
ప్రతిపాదనలు పంపించామంటున్న అధికారులు
పాచిపెంట/సీతంపేట రూరల్, జూన్ 3(ఆంధ్రజ్యోతి): రేషన్ డిపోల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ నెల ఒకటో తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా చౌక ధరల దుకాణాల వద్ద కార్డుదారులకు సరుకులు అందిస్తున్నారు. అయితే పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో చాలావరకు జీసీసీ డీఆర్ డిపోల భవనాలు శిఽథిలావస్థకు చేరుకున్నాయి. మరికొన్ని డిపోలు కనీస మరమ్మతులకు నోచుకోలేదు. వర్షం పడితే అయా భవనాలు పూర్తిగా కారిపోతుంటాయి. ఈ నేపథ్యంలో ఆయా చోట్ల సరుకుల నిల్వ, రేషన్ పంపిణీ అన్నది ఇబ్బందికరంగా మారింది. దీంతో డీలర్లు తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక తప్పడం లేదు.
పార్వతీపురం డివిజన్లో..
పార్వతీపురం డివిజన్లో 95 జీసీసీ డీఆర్ డిపోలు, విజయనగరం పరిధిలో ఆరు డిపోలు ఉన్నాయి. వీటిలో 30 డీఆర్ డిపోలు శిథిలావస్థకు చేరాయి. మిగిలిన 42 డిపోలకు అత్యవసర మరమ్మతులు చేయించాల్సి ఉంది. అయితే వీటి మరమ్మతులు, పక్కా భవన నిర్మాణాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు పార్వతీపురం జీసీసీ డీఎం రామారావు తెలిపారు. ప్రస్తుతానికి ఈ భవనాల్లోనే నిత్యవసర సరుకులు నిల్వ, పంపిణీ చేపడుతున్నట్లు చెప్పారు.
- పాచిపెంట మండలం విషయానికొస్తే 29 పంచాయతీల్లో 23 డిపోలు ఉన్నాయి. వాటిల్లో 12 సివిల్ సప్లైస్, 11 జీసీసీ డిపోలు ఉన్నాయి. 15,382 మంది కార్డుదారులకు రేషన్ అందాల్సి ఉంది. అద్దె భవనాల్లో కొనసాగే సివిల్ సప్లైస్ డిపోలకు కొంతమేర ఇబ్బంది లేదు. జీసీసీ సేల్స్మన్లకు మాత్రం శిఽథిలావస్థ భవనాలతో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం వేరే భవనాల్లో నిత్యావసర సరుకులను నిల్వ చేయాల్సి వస్తోంది. మరోవైపు రేషన్ కోసం వచ్చే గిరిజనులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు. శిథిలావస్థకు చేరుకున్న జీసీసీ డీఆర్ డిపోల భవనాలను తక్షణమే మరమ్మతులు చేపట్టాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. శిఽథిలావస్థకు చేరుకున్న జీసీసీ డిపో భవనాల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పాచిపెంట డిప్యూటీ తహసీల్దార్ జి.చంద్రశేఖర్ తెలిపారు. నిబంధనల మేరకు డీలర్లు, సేల్స్మన్లు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాల్సి ఉందన్నారు.
సీతంపేట పరిధిలో..
సీతంపేట గిరిజనసహకార సంస్థ(జీసీసీ)పరిధిలో మొత్తంగా 36 డీఆర్ డిపోలు ఉన్నాయి. వీటిలో 14 డిపోలు శిథిలావస్థలో ఉన్నాయి. వాటికి ఉపాధి నిధులతో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయించేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. మొదటివిడతలో ఆరు డిపోల పనులు చేపడతారు. రెండో విడతలో మరో ఆరు డిపోలకు మరమ్మతులు చేయించి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురానున్నారు. అంతేకాకుండా రెండు డిపోలకు సంబంధించి పక్కా భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు కానున్నాయి. ఇకపోతే మూడు గోడౌన్లకు కూడా మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురాన్నుట్లు జీసీసీ బీఎం డి.కృష్ణారావు తెలిపారు. అయితే డీఆర్ డిపోలు శిథిలావస్థలో ఉన్నప్పటికీ కార్డుదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు.