ఆ ఘటనకు ఐదేళ్లు
ABN , Publish Date - Dec 27 , 2025 | 12:27 AM
: నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం దేవస్థానంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసానికి గురై ఆదివారం నాటికి ఐదేళ్లు పూర్తికానుంది.
-రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం
- ఇప్పటికీ దొరకని నిందితులు
- కేసు దర్యాప్తుపై గత వైసీపీ సర్కారు నిర్లక్ష్యం
- కూటమి ప్రభుత్వమే నిజాలు తేల్చాలని భక్తుల విన్నపం
విజయనగరం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం దేవస్థానంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసానికి గురై ఆదివారం నాటికి ఐదేళ్లు పూర్తికానుంది. ఈ ఘటనకు సంబంధించి ఇంతవరకూ నిందితులు చిక్కలేదు. అదిగో ఇదిగో అంటూ గత వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేసింది. ఆర్భాటపు హడావుడితో గడిపేసింది. రామతీర్థం దేవస్థానం పరిధిలోని బోడికొండపై ఉన్న కోదండ రామాలయంలోని రాముడి విగ్రహాన్ని 2020 డిసెంబరు 28న దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రధాన ప్రతిపక్షాలైన టీడీపీ, బీజేపీలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించాయి. అప్పటి విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు, అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ తదితరులు ఆలయాన్ని సందర్శించారు. రాజకీయ పార్టీలు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి మరీ పోరాడాయి. నాడు వివిధ పీఠాధిపతులు సందర్శించి ఘటనపై విస్మయం వ్యక్తం చేశారు. ధార్మిక సంఘాలు ఆందోళనబాట పట్టాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం కేసును సీబీ సీఐడీకి అప్పగించింది. ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించింది. దర్యాప్తు అధికారులు పలుమార్లు కొండపైకి వచ్చి విచారణ చేపట్టారు. ఆగంతకులు ఎలక్ర్టానిక్ రంపంతో విగ్రహాలను కోసినట్టు గుర్తించారు. అప్పట్లో ఏకకాలంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. ఇటువంటి రంపంతోనే రాష్ట్రంలో మిగతాచోట్ల సైతం ధ్వంసాలకు పాల్పడినట్టు తేల్చారు. ఆ ఒక్క మాట తప్పించి దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదు. అటు తరువాత ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు లీకులిచ్చారు. కానీ రాజకీయ కోణంలోనే వారిని అరెస్టు చేసినట్టు అప్పట్లో విపక్షాలు మండిపడ్డాయి. అసలు చేసినదెవరు? చేయించినదెవరు? అన్నది లోతుగా దర్యాప్తు జరగలేదు.
- రాముడి విగ్రహం ధ్వంసం తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి విగ్రహాలను వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చి ప్రతిష్ఠించింది. ఏడాదిలో కోదండరామస్వామి ఆలయాన్ని పునర్నిర్మిస్తామని అప్పట్లో ప్రకటించింది. ఇందుకుగాను రూ.3 కోట్లు కేటాయించినట్టు చెప్పింది. ఆగమ శాస్త్రం ప్రకారం ఏడాదిలో ఆలయాన్ని పునర్నిర్మించి విగ్రహాలు ప్రతిష్టిస్తే చాలా మంచిదని చిన్నజీయర్స్వామి చెప్పారు. కానీ జగన్ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది. ఘటన జరిగిన ఏడాదికి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. కేవలం భూమి పూజకే చాలారోజులు పట్టింది. ఆలయ నిర్మాణ పనులు కూడా నత్తనడకన సాగాయి.
అశోక్పై పెత్తనానికి..
రామతీర్థం దేవస్థానం మాటున మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్గజపతిరాజుపై పెత్తనం సాగించేలా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం వ్యవహారాలను నడిపింది. ఇందుకు దేవదాయశాఖ అధికారులను అడ్డం పెట్టుకొని అప్పటి ప్రభుత్వ పెద్దల్లో ఒకరైన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తతంగం నడిపించినట్టు ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో అశోక్గజపతిరాజును తప్పించి సంచయితకు మాన్సాస్ పీఠాన్ని కట్టబెట్టి భంగపడిన సదరు నేత ఎలాగైనా అశోక్ను దెబ్బకొట్టాలన్న వ్యూహంతో అధికారులను ఉసిగొల్పారు. రామతీర్థం దేవస్థానం వేదికగా అప్పుడు అశోక్గజపతిరాజును అవమానించారు. ఆలయ నిర్మాణ శంకుస్థాపన సమయంలో అశోక్ను అడ్డుకొని చాలా తప్పుచేశారు. అప్పట్లో అహంకారపూరితంగా వ్యవహరించిన వైసీపీ సర్కారు ప్రజాగ్రహంలో కొట్టుకుపోయింది. అప్పట్లో బాధితుడిగా మిగిలిన అశోక్గజపతిరాజు ఇప్పుడు గోవా రాష్ట్రానికి గవర్నర్ అయ్యారు. నాడు అశోక్గజపతిరాజు విషయంలో జగన్ సర్కారు వ్యవహరించిన తీరును అప్పట్లో జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అంతర్గత సమావేశాల్లో తప్పుపట్టారు. జిల్లాలో వైసీపీ ఓటమికి ప్రధాన కారణం రామతీర్థం దేవస్థానం ఘటనేనని ఇప్పటికీ వైసీపీ శ్రేణులు భావిస్తుంటాయి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ ఘటనపై నిజ నిజాలు నిగ్గు తేల్చాలని జిల్లా ప్రజలతో పాటు భక్తులు కోరుతున్నారు.