Five in Three Months మూడు నెలల్లో ఐదుగురు
ABN , Publish Date - Jul 27 , 2025 | 12:08 AM
Five in Three Months సీతంపేట ఏజెన్సీలో మలేరియా విజృంభిస్తోంది. గిరిజన గ్రామాల్లో ప్రజలను తీవ్రంగా వణికిస్తోంది. ప్రధానంగా దోనుబాయి పీహెచ్సీ పరిధిలో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. మూడు నెలల వ్యవధిలో ఐదుగురు మృతి చెందడం సర్వత్రా కలవరపరుస్తోంది.
దోనుబాయి పీహెచ్సీ పరిధిలో అధికం
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు శూన్యం
సీతంపేట రూరల్, జూలై 26(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలో మలేరియా విజృంభిస్తోంది. గిరిజన గ్రామాల్లో ప్రజలను తీవ్రంగా వణికిస్తోంది. ప్రధానంగా దోనుబాయి పీహెచ్సీ పరిధిలో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. మూడు నెలల వ్యవధిలో ఐదుగురు మృతి చెందడం సర్వత్రా కలవరపరుస్తోంది. ఐటీడీఏ పరిధిలోని కుసిమి, దోనుబాయి, మర్రిపాడు పీహెచ్సీలతో పాటు సీతంపేట ఏరియా ఆసుపత్రిలో రోజుకి పదుల సంఖ్యలో మలేరియా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే అపడమిక్ సీజన్ ప్రారంభానికి ముందు నుంచే దోనుబాయి పీహెచ్సీ పరిధిలో మలేరియా పంజా విసిరింది. కాగా ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు సుమారు 80కి పైగా అక్కడ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏజెన్సీలో ముందస్తుగా వర్షాలు కురవడం, వాతావరణంలో మార్పులు, గ్రామాల్లో పారిశుధ్యం లోపం తదితర కారణాలతో మలేరియా పాజిటివ్ కేసులు అధికమవు తున్నాయి. ఇకపోతే కుసిమి, మర్రిపాడు పీహెచ్సీలతో పోల్చుకుంటే దోనుబాయి పరిధిలో మలేరియా మరణాలు కూడా ఎక్కువగా సంభవిస్తుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. దీంతో గిరిజన గ్రామస్థులు భయబ్రాంతులకు గురువుతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా సంబంధిత వైద్యాధికారులు స్పందించకపోవడంపై పెదవి విరుస్తున్నారు.
వరుస మరణాలు
దోనుబాయి పీహెచ్సీ పరిధి పొల్ల పంచాయతీలోని నాయకమ్మగూడకి చెందిన ఆరిక మోహిత్ మలేరియాతో బాధపడుతూ.. ఈ ఏడాది మేలో మృతిచెందాడు. జూన్లో జగతిపల్లి దీసరగూడకు చెందిన సవర ఆనందరావు, ఈనెలలో ఈతమానుగూడకు చెందిన సవర భాస్కరరావులను మలేరియా మింగేసింది. ఈనెల 20న చీడిమానుగూడ గ్రామానికి చెందిన ఆరిక ప్రియాంక అనే బాలింత జ్వరంతో విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆమె నెలల మగశిశువుకు కూడా సరైన వైద్యం అందక మృతిచెందాడు. కోపువలస గ్రామంలో సవర మాదవ్ , ధనుంజయ అనే ఇద్దరు ఇద్దరు గిరిజన చిన్నారులు జ్వరంతో బాధపడుతున్నారు. ఇటీవల వైద్య సిబ్బంది వారి నుంచి రక్తనమూనాలు సేకరించారు.
క్షేత్రస్థాయిలో వైద్యం అందక ..
మలేరియా పంజా విసురుతున్నా.. క్షేత్రస్థాయిలో జ్వరపీడితులకు సరైన వైద్యం అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జ్వరపీడితులకు పీహెచ్సీ, గ్రామస్థాయిలో రక్తపరీక్షలు చేయడంతోనే సరిపెడుతున్నారు. మలేరియా పాజిటివ్గా నిర్ధారణ అయిన పేషెంట్లపై పర్యవేక్షణ లేకపోవడం వల్లే అధికంగా మరణాలు సంభవిస్తున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైద్యుల సూచనల మేరకు మలేరియా జ్వరపీడితులు సక్రమంగా మందుల వాడుతున్నారా లేదా? జ్వరం తీవ్రత ఎలా ఉంది, ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? అనే అంశాలపై గ్రామ స్థాయిలో వైద్య సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంపై గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని, మలేరియా అదుపునకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని కోరుతున్నాయి.
డిప్యూటీ డీఎంహెచ్వో ఏమన్నారంటే..
‘మలేరియా జ్వరాలపై అప్రమత్తంగా ఉంటున్నాం. పీహెచ్సీల పరిధిలో నమోదవుతున్న జ్వరపీడితులకు సకాలంలో వైద్యసేవలు అందిస్తున్నాం.’ అని డిప్యూటీ డీఎంహెచ్వో పి . విజయపార్వతి తెలిపారు.