షాపింగ్ మాల్లో అగ్నిప్రమాదం
ABN , Publish Date - May 10 , 2025 | 12:10 AM
నగరంలోని రైల్వేస్టేషన్ రోడ్డులో గల ఫోర్ట్సిటీ షాపింగ్ మాల్లో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది.

-తప్పిన పెనుముప్పు
-రెండు ఫైరింజిన్లతో మంటలు అదుపులోకి..
విజయనగరం, మే 9 (ఆంధ్రజ్యోతి): నగరంలోని రైల్వేస్టేషన్ రోడ్డులో గల ఫోర్ట్సిటీ షాపింగ్ మాల్లో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో మాల్లో ఉన్న జనం ఒక్కసారిగా పరుగులు తీశారు. చిన్నారులు ఎక్కువగా ఉండే గేమ్జోన్, రెస్టారెంట్ సీలింగ్ల నుంచి దట్టమైన పొగలు రావటంతో ఏం జరుగుతుందోనని బెంబేలెత్తిపోయారు. విషయం గుర్తించే సరికే ఫ్లోర్లో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో చిన్నారులను ఎత్తుకుని తల్లిదండ్రులు పరుగులు తీశారు. అలాగే షాపింగ్ కాంప్లెక్స్లో బంగారం, బ్రాండెడ్ దుస్తుల షాపులు ఉన్నాయి. వీటితో పాటు మాల్లో 4 థియేటర్లు కూడా ఉన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో సినిమాలు విడిచి పెట్టారు. లేకుంటే సినిమాహాల్స్లో తొక్కిసలాటతో ప్రాణనష్టం జరిగి ఉండేది. విషయం తెలుసుకున్న ఫైర్ అధికారులు హూటాహుటిన షాపింగ్ మాల్ వద్దకు చేరుకుని అద్దాలు పగులగొట్టి ఫైర్ ఫైటర్స్ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఎంత వరకు ఆస్తి నష్టం జరిగిందనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి రాంప్రకాశ్ తన బృందంతో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదాన్ని నివారించటానికి 2 ఫైర్ ఇంజన్లు, సుమారు 20 మంది ఫైర్ ఫైటర్స్, మాల్ సిబ్బంది పాల్గొన్నారు.