బుచ్చెంపేటలో కొట్లాట
ABN , Publish Date - Jul 13 , 2025 | 11:49 PM
రాజాం మున్సిపాలిటీ పరిధిలోని బుచ్చెంపేటలో ఆదివారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన కొట్లాటలో పదిమంది గాయపడ్డారు.
పదిమందికి గాయాలు
ఇద్దరి పరిస్థితి విషమం
రాజాం రూరల్, జులై 13 (ఆంధ్రజ్యోతి): రాజాం మున్సిపాలిటీ పరిధిలోని బుచ్చెంపేటలో ఆదివారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన కొట్లాటలో పదిమంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. ఇద్దరు రాజాంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరో ఐదుగురు రాజాం సామాజిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరువర్గాల మధ్య స్థలం విషయంలో ఆదివారం ఉదయం వివాదం చెలరేగింది. రాత్రి వరకూ పెద్దల సమక్షంలో చర్చలు జరిగాయి. అయితే సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇరువర్గాలు కొట్లాటకు దిగారు. పిట్టా రాము, సత్యం, ముడ్డన సూరిబాబు, పిట్టా రాజేంద్ర తదితరులంతా గాయపడిన వారిలో ఉన్నారు. రాజాం పొలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బుచ్చెంపేటలో పొలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.