Festive-Time Shock! పండుగ వేళ ఉలికిపాటు!
ABN , Publish Date - Oct 20 , 2025 | 12:13 AM
Festive-Time Shock! పార్వతీపురం పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎన్నడూ లేని విధంగా భారీ పేలుడు సంభవించింది. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గుర య్యారు. వాస్తవంగా మందుగుండు సామగ్రిని బస్సులు, రైళ్లలో పార్సిల్ సర్వీస్ ద్వారా పంపిం చకూడదు. వాటి వల్ల సంభవించే ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుంది. అయితే ఆదివారం పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో చోటుచేసుకున్న పేలుడు ఘటనతో ప్రయాణికులు, స్థాని కులు షాక్కు గురయ్యారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
నలుగురికి తీవ్ర గాయాలు
లగేజ్ కిందకు దించే క్రమంలో ఘటన
పార్సిల్ కార్యాలయం షెడ్ పైభాగం, కిటికీ అద్దాలు ధ్వంసం
భయబ్రాంతులకు గురైన ప్రయాణికులు
అధికారుల పర్యవేక్షణ లోపంపై విమర్శల వెల్లువ
బెలగాం, అక్టోబరు19(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎన్నడూ లేని విధంగా భారీ పేలుడు సంభవించింది. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గుర య్యారు. వాస్తవంగా మందుగుండు సామగ్రిని బస్సులు, రైళ్లలో పార్సిల్ సర్వీస్ ద్వారా పంపిం చకూడదు. వాటి వల్ల సంభవించే ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుంది. అయితే ఆదివారం పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో చోటుచేసుకున్న పేలుడు ఘటనతో ప్రయాణికులు, స్థాని కులు షాక్కు గురయ్యారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షతగాత్రుల కుటుంబాల్లో మాత్రం పండుగ సందడి లేకుండా పోయింది. వివరాల్లోకి వెళ్తే..
పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్లోకి ఆదివారం ఉదయం విజయనగరం నుంచి ఓ బస్సు వచ్చింది. దానికి సమీపంలోనే ఉన్న ఆర్టీసీ పార్సిల్ కార్యాలయం నుంచి ఓ కళాసి వచ్చి.. ఆ బస్సులో సామాన్లు దించేందుకు వెళ్లాడు. మందుగుండు సామగ్రి అని తెలియక లగేజ్ బాక్స్ను పార్సిల్ కౌంటర్ వద్దకు తీసుకొచ్చి కిందకు దించగా ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో ప్రయాణికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పేలుడు ధాటికి పార్సిల్ కౌంటర్ షెడ్ పైభాగం, అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో కళాసి రెడ్డి రమేష్, బస్సు డ్రైవర్ తెర్లి రవి, తోపుడు బండి కార్మికుడు సుందరరావు, మరో వ్యక్తి కె.రమేష్కు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహటిన క్షతగాత్రులను పార్వతీపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తర లించారు. రవి, ఆర్.రమేష్ను మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు, కె.రమేష్ను విజయనగరం మహా రాజా ఆసుపత్రికి తరలించారు. అయితే కేజీహెచ్లో చికిత్స పొందుతూ డ్రైవర్ రవి మృతి చెందారు. ఆయనది నర్సిపురం గ్రామంగా తెలిసింది. కాగా విజయనగరంలోని పార్సిల్ బుక్ చేసిన వారి ఫోన్ నెంబర్, పార్వతీపురంలోని పార్సిల్ తీసుకునే వారి ఫోన్ నెంబర్ ఒకటే ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్సిల్ పంపిన వ్యక్తి జియ్యమ్మవలస నిమ్మలపాడు గ్రామానికి చెందిన కిషోర్ కుమార్ అని తెలుస్తోంది. 25 కేజీల జనరల్ ఐటమ్ పేరుతో పార్సిల్ బుక్ అయినట్లుగా రశీదు ఉన్నట్లు ఆర్టీసీ కొరియర్ సర్వీసు అధికారులు చెబుతున్నారు. ఎస్పీ మాధవరెడ్డి తన సిబ్బందితో అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. మరోవైపు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పేలుడుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాణసంచాను పార్సిల్ ద్వారా పంపించ కూడదన్నారు. ఇటువంటి దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆయనతోపాటు ఎస్పీ జిల్లా కేంద్రాసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. అక్కడ వైద్యాధికారులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందజేయాలని ఆదేశించారు. డీఎంహెచ్వో భాస్కరరావు కూడా ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రుల ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు. సంబంధిత వైద్యులను అప్రమత్తం చేశారు.
మంత్రుల ఆరా
పార్వతీపురం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం పార్వతీపురంలో జరిగిన బాణసంచా పేలుడు ఘటనపై మంత్రులు గుమ్మిడి సంధ్యారాణి, అనిత, కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. సంఘటన ఏ విధంగా జరిగింది. దానికి గల కారణాలు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.