Garugubilli PACS గరుగుబిల్లి పీఏసీఎస్ అక్రమాలపై విచారణ గడువు పొడిగింపు
ABN , Publish Date - Nov 05 , 2025 | 12:08 AM
Extension of Deadline for Inquiry into Garugubilli PACS Irregularities గరుగుబిల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్) పరిధిలో అక్రమాల విచారణక గడువు పొడిగించినట్లు విచారణాధికారి ఆర్.రమణ మూర్తి తెలిపారు.
గరుగుబిల్లి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): గరుగుబిల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్) పరిధిలో అక్రమాల విచారణక గడువు పొడిగించినట్లు విచారణాధికారి ఆర్.రమణ మూర్తి తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక పీఏసీఎస్ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ.. ‘ గతంలో విధులు నిర్వహించి మృతి చెందిన సీఈవో సంఘం పరిధిలో సుమారు రూ. 85 లక్షలు పైబడి దుర్వినియోగం చేసినట్లు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆగస్టు 20 నుంచి విచారణ ప్రారంభమైంది. సంఘం పరిధిలో సుమారు 1500 మందికి నోటీసులు జారీ చేశాం. 600 మంది సభ్యులను విచారించాం. గతనెల 22కు విచారణ గడువు ముగిసింది. అయితే మరికొంతమంది సభ్యులను విచారించాల్సి ఉన్నందున డిసెంబరు 20 వరకు విచారణ గడువు పొడిగించాం. ఇప్పటివరకు నిర్వహించిన విచారణలో సుమారు రూ.70లక్షలకు పైబడి నిధులు దుర్వినియోగమైనట్లు నిర్ధారించాం. సంఘం పరిధిలో పలు రుణాలకు చెందిన వారి నుంచి పూర్తిస్థాయిలో వివరాలు సేకరిస్తున్నాం. రుణాలు తీసుకుని, నోటీసులు అందుకోని సభ్యులు కూడా విచారణకు హాజరుకావొచ్చు. ఇప్పటివరకు చెల్లించిన మొత్తాలకు సంబంధించి రశీదులతో రావాలి. గతంలో రైతులకు అందించిన నోటీసుల్లో తేదీలతో సంబంధం లేకుండా విచారణ అధికారి ఎదుట హాజరుకావొచ్చు. నవంబరు నెలాఖరుకు సంబంధిత సభ్యుల నుంచి సందేహాలు, అభ్యంతరాలు సేకరణ పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత బాధ్యులపై తగు చర్యలు నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదిస్తాం.’ అని తెలిపారు.