still not completed! ఏడాదిన్నర దాటినా.. పూర్తికాలే..!
ABN , Publish Date - May 12 , 2025 | 11:26 PM
Even after one and a half years... still not completed! సీతంపేట ఏజెన్సీలో పీఎం జన్మన్ పథకం కింద మంజూరైన గృహ నిర్మాణాల ప్రగతి అంతంత మాత్రంగానే ఉంది. బిల్లుల చెల్లింపులు ఆలస్యం కావడం, నిర్మాణ సామగ్రి ధరలు అమాంతం పెరగడం తదితర కారణాలతో పీవీటీజీ(సవర) లబ్ధిదారులు తలలు పట్టుకుంటున్నారు.
బిల్లుల చెల్లింపుల్లో జాప్యం
పెరిగిన నిర్మాణ సామగ్రి ధరలు
గిరిజనులపై ఆర్థిక భారం
గృహ నిర్మాణాలపై ఆసక్తి చూపని వైనం
సీతంపేట రూరల్, మే12(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలో పీఎం జన్మన్ పథకం కింద మంజూరైన గృహ నిర్మాణాల ప్రగతి అంతంత మాత్రంగానే ఉంది. బిల్లుల చెల్లింపులు ఆలస్యం కావడం, నిర్మాణ సామగ్రి ధరలు అమాంతం పెరగడం తదితర కారణాలతో పీవీటీజీ(సవర) లబ్ధిదారులు తలలు పట్టుకుంటున్నారు. ఆర్థిక భారంతో గృహ నిర్మాణాలపై ఆసక్తి చూపడం లేదు. అవగాహన కల్పించాల్సిన అధికారులు కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఉన్నతాధికారులు హౌసింగ్ ప్రగతిపై ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహించినా నిర్దేశిత లక్ష్యాలకు చేరుకోలేకపోతున్నారు.
ఇదీ పరిస్థితి..
గతేడాది జనవరిలో సీతంపేట పరిధిలో పీవీటీజీలకు 2024 ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో ఇంటి యూనిట్ ధర రూ.2.39లక్షలుగా నిర్ణయించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.2.39 లక్షలు కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పీవీటీజీ(పర్టిక్లరిలీ వలనరబుల్ ట్రైబల్ గ్రూప్స్)గృహ నిర్మాణాలు కోసం రూ.1లక్ష అందజేస్తామని ప్రకటించింది. అయితే అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. లబ్ధిదారుడు ఇంటి నిర్మాణం ప్రారంభించిన నాటి నుంచి పునాది దశలో రూ.70వేలు, రూఫ్లెవెల్కి రూ.90 వేలు, శ్లాబుకి రూ.40 వేలు, బాత్రూం నిర్మాణానికి రూ.12వేలు, మస్తర్ వేతనాల కింద మరో రూ.27వేలను లబ్ధిదారులకు విడతల వారీగా అందజేస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు అందకపోవడం, సిమెంట్, ఐరన్ ధరలు ఎక్కువగా ఉండడంతో పీవీటీజీ లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. దీంతో పీఎం జన్మన్ పథకం కింద పీవీటీజీలకు ఇళ్లు మంజూరై ఏడాదిన్నర దాటుతున్నా.. నేటికీ నిర్మాణాలు నత్తనడకనే సాగుతున్నాయి. మంజూరైన 2024 గృహాలకు గాను ఇంకా పునాది స్థాయిలో 944, రూఫ్ లెవెల్లో 190, ఆర్వోఎఫ్ఆర్ క్లియరెన్స్ లేక 130, ఇంకా పూర్తిగా ప్రారంభించని గృహాలు 600 వరకు ఉన్నాయి. కాగా మరో 200 గృహాలు అనర్హులకు కేటాయించినట్లు సర్వేలో గుర్తించారు.
కాంట్రాక్టర్లను ఆశ్రయిస్తున్న ఆదివాసీలు
- సిమెంట్, ఐరన్ ఇతరాత్ర గృహనిర్మాణ సామగ్రి ధరలు మండిపోతున్న తరుణంలో ఆర్థిక భారాన్ని భరించలేక కొందరు గిరిజనులు కాంట్రాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. ఇంటి నిర్మాణ బాధ్యతలను వారికి అప్పగిస్తున్నారు. బిల్ టు బిల్ ప్రాతిపదికన ఇంటి నిర్మాణ యూనిట్ ధర ఎంత ఉంటే అంతా సంబంధిత కాంట్రాక్టర్కు చెల్లించేందుకు లబ్ధిదారులు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు.
- అంటికొండ పంచాయతీ పరిధి పెద్దగూడ, తలైబుగూడ, నీలంగూడ, తురాయిమానుగూడ, లంబగూడ గ్రామాల్లో గిరిజనుల ఇంటి నిర్మాణాలను కాంట్రాక్టర్లే చేపడుతున్నారు. లబ్ధిదారుడితో పాటు కుటుంబసభ్యులు నిర్మాణ పనుల్లో సహాయం చేయాల్సి ఉంటుంది. నిర్మాణ సామగ్రి మొత్తాన్ని కాంట్రాక్టరే ఏర్పాటు చేస్తాడు. బిల్లులు అవుతున్న ప్రాప్తికి లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతా నుంచి ఆ నగదును కాంట్రాక్టర్లు తీసుకుంటారు.
పీఎంఏవై గృహాల పరిస్థితి ఇలా..
పీఎంఏవై(ప్రధాన మంత్రి ఆవాస యోజన)గ్రామీణ పథకం కింద కేంద్ర ప్రభుత్వం సీతంపేట ఏజెన్సీకి 2021-22లో 1089 గృహాలను మంజూరుచేసింది. ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షలుగా యూనిట్ ధర నిర్ణయించింది. గృహ నిర్మాణాలను వేగవంతం చేయడంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. బిల్లులు చెల్లింపులు కూడా పూర్తిస్థాయిలో జరగకపోవడంతో మొండి గోడలతోనే ఇళ్లు దర్శన మిస్తున్నాయి. 1089 గృహాలకు గాను గొయ్యిలు తీసినవి 190, పునాదులతో నిర్మించినవి 181, శ్లాబు ఎత్తువరకు వచ్చినవి 130, శ్లాబు పూర్తయినవి 130 వరకు ఉన్నాయి. నిర్మాణాలు పూర్తయినవి 402 కాగా 54 ఇళ్ల నిర్మాణాలు నేటికీ ప్రారంభించలేదు.
చెల్లింపుల్లో జాప్యం..
బిల్లుల చెల్లింపులు ఆలస్యమవడంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. అందుకనే మా గ్రామానికి మంజూరైన ఏడు గృహాల పనుల బాధ్యతను కాంట్రాక్టర్కు అప్పగించాం. మాపై ఎటువంటి ఆర్థిక భారం పడడం లేదు. సదరు కాంట్రాక్టర్ కూడా పనులు వేగవంతం చేస్తున్నారు.
-ఎస్.హరిబాబు, తురాయిమానుగూడ
============================
హౌసింగ్ ఏఈ ఏమన్నారంటే...
‘ పీఎం జన్మన్ పథకం కింద గిరిశిఖర గ్రామాల్లో మంజూరైన గృహ నిర్మాణాల పనులు జరుగుతున్నాయి. బిల్లుల చెల్లింపులు చేస్తున్నాం. కొద్ది రోజుల కిందట 102 మంది లబ్ధిదారుల బ్యాంక్ఖాతాల్లో నగదు జమైంది.’ అని హౌసింగ్ ఏఈ సీహెచ్ వెంకటేష్ తెలిపారు.