అలరించిన సంగీత స్వరాభిషేకం
ABN , Publish Date - Dec 06 , 2025 | 12:16 AM
ఘంటసాల జయంతి సందర్భంగా స్థానిక ఆనందగజపతి కళాక్షేత్రంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ఘంటసాల నిర్విరామ సంగీత స్వరాభిషేకం అలరించింది.
- డ్రమ్స్తో ఆదరగొట్టిన శివమణి
విజయనగరం కల్చరల్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి) ఘంటసాల జయంతి సందర్భంగా స్థానిక ఆనందగజపతి కళాక్షేత్రంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ఘంటసాల నిర్విరామ సంగీత స్వరాభిషేకం అలరించింది. ముఖ్య అతిథిగా పెర్కషన్ మాస్ట్రో, పద్మశ్రీ శివమణి హాజరయ్యారు. తన డ్రమ్స్తో అదరగొట్టి అందరినీ ఆనందంలో ముంచెత్తారు. ఉదయం నుంచి రాత్రి వరకూ పలువురు గాయనీ, గాయకులు.. ఘంటసాల పాటలతో అందరినీ మైమరిపించారు. ఈ సందర్భంగా శివమణి మాట్లాడుతూ.. ఘంటసాల జయంతి ఉత్సవంలో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఇందుకు స్మారక కళాపీఠానికి అభినందనలు తెలిపారు. తన తండ్రి డ్రమ్ము వాయించే వారని, ఆయన ద్వారా తాను డ్రమ్స్ వాయిస్తూ ఈ స్థాయిలో ఉన్నట్టు చెప్పారు. తనకు బాలసుబ్రహ్మణ్యం గాడ్ ఫాదర్ అని పేర్కొన్నారు. పిల్లలు సెల్ఫోన్లకు దూరంగా ఉండాలని, పుస్తకాలతో తమ ప్రతిభ పాటవాలు ప్రదర్శించాలని అన్నారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ.. ఘంటసాల స్మారక కళాపీఠం ఇటువంటి బృహత్తర కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం శివమణిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఘంటసాల స్మారక కళాపీఠం వ్యవస్థాపకుడు ఎం.భీష్మారావు, నగర డిప్యూటీ మేయర్ శ్రావణి, స్మారక కళాపీఠం గౌరవ అధ్యక్షుడు ఈఆర్ సోమయాజులు, కళాపీఠం అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు దుర్వాసుల రాజేంద్రప్రసాద్, దవళ సర్వేశ్వరరావు, కార్యదర్శి ఉమాశంకర్, కోశాధికారి వైవీవీ సత్యనారాయణ (అబ్బులు), కార్యనిర్వహక అధ్యక్షులు బొత్స సూర్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్వీఎల్ఎన్ గుప్తా, లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, తదితరులు పాల్గొన్నారు.