దురుబిలిలో ఏనుగుల బీభత్సం
ABN , Publish Date - Aug 04 , 2025 | 12:25 AM
మండలంలోని దురుబిలిలో ఏనుగులు ఆదివారం బీభత్సం సృష్టించాయి.
- సోలార్ పలకలు, పైపులైన్లు ధ్వంసం
-భయాందోళనలో గిరిజనులు
కురుపాం రూరల్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దురుబిలిలో ఏనుగులు ఆదివారం బీభత్సం సృష్టించాయి. గ్రామానికి చెందిన పువ్వల చంటి పొలంలోని సోలార్ పలకలు, పైపు లైన్లను ధ్వంసం చేశాయి. మరికొందరి రైతులకు చెందిన వరినారు మళ్లను, కూరగాయల పంటలను నాశనం చేశాయి. గత నాలుగు రోజులుగా ఏనుగులు గ్రామస్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సాధారణంగా గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు పొలాలు, కొండపోడుల్లోనే షెడ్లు వేసుకుని నివశిస్తుంటారు. ఈ షెడ్లను గిరిజనులు పాకలు అంటుంటారు. వారు ఎక్కువగా ఈ పాకల్లోనే ఉంటుంటారు. అయితే, ఏనుగుల సంచారంతో దురుబిలి గ్రామస్థులు పాకల వైపు వెళ్లడం మానేశారు. ఏనుగులపై కవ్వింపు చర్యలు చేపట్టకూడదంటూ అటవీశాఖ సిబ్బంది గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నారు. ఏనుగులను తమ ప్రాంతం నుంచి తరలించాలంటూ దురుబిలి గ్రామస్థులు కోరుతున్నారు.