Electricity Meters ఒకే వ్యక్తి పేరిట 13 జిల్లాల్లో విద్యుత్ మీటర్లు
ABN , Publish Date - Jul 28 , 2025 | 11:33 PM
Electricity Meters in the Name of One Person Across 13 Districts అధికారుల తప్పిదాలు పేదలకు శాపంగా మారుతున్నాయి. సంక్షేమ పథకాలకు దూరం చేస్తున్నాయి. ఒక వ్యక్తి పేరిట 13 జిల్లాల్లో విద్యుత్ మీటర్లు ఉన్నట్లు ఆన్లైన్లో చూపించడంతో ఓ కుటుంబంలో ముగ్గురు పిల్లలు ‘తల్లికి వందనం’ పథకానికి నోచుకోలేదు.
బెలగాం, జూలై 28(ఆంధ్రజ్యోతి): అధికారుల తప్పిదాలు పేదలకు శాపంగా మారుతున్నాయి. సంక్షేమ పథకాలకు దూరం చేస్తున్నాయి. ఒక వ్యక్తి పేరిట 13 జిల్లాల్లో విద్యుత్ మీటర్లు ఉన్నట్లు ఆన్లైన్లో చూపించడంతో ఓ కుటుంబంలో ముగ్గురు పిల్లలు ‘తల్లికి వందనం’ పథకానికి నోచుకోలేదు. వివరాల్లోకి వెళ్తే.. పార్వతీపురం వివేకానంద కాలనీలో ఓ అద్దె ఇంటిలో సబ్బవరపు శ్రీను, రమాదేవి దంపతులు నివసిస్తున్నారు. వారికి ముగ్గురు సంతానం. అచ్యుత (8వ తరగతి), దీక్షిత (6వ తరగతి), గీత (3వ తరగతి) చదువుతున్నారు. అయితే ‘తల్లికి వందనం’ పథకం వారికి వర్తించలేదు. దీంతో రమాదేవికి సచివాలయానికి వెళ్లి అడగ్గా.. ఆమె భర్త పేరు మీద 13 జిల్లాలో విద్యుత్ మీటర్లు ఉన్నట్లు చూపిస్తుందని అక్కడున్న సిబ్బంది చెప్పారు. దీంతో రమాదేవి ఎలక్ర్టికల్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. సంబంధిత అధికారులు శ్రీను పేరు మీద ఉన్న మీటర్లు తొలగించినప్పటికీ ఆన్లైన్లో చూపిస్తుండడంతో రెండో విడత కూడా వారికి ‘తల్లికి వందనం’ కింద నగదు జమకాలేదు. దీంతో రమాదేవి సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్కు వచ్చింది. పథకం వర్తింపజేసి .. తమకు న్యాయం చేయాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేసింది.