రంగంలోకి డీఆర్డీఏ అధికారులు
ABN , Publish Date - Dec 12 , 2025 | 11:47 PM
తునివాడలో ఉన్న 39 పొదుపు సంఘాల బ్యాంక్ లింకేజి, స్రీనిధి లెక్కలు తేల్చేందుకు ఒకవైపు యూనియన్ బ్యాంక్ ఉన్నతాధికారులు విచారణ చేపడుతుండగా... మరోవైపు శుక్రవారం డీఆర్డీఏ, వెలుగు అధికారులు రంగంలోకి దిగారు.
- తునివాడలో నిధుల స్వాహాపై కొనసాగుతున్న విచారణ
- బ్యాంక్మిత్ర, వీఏఓలు పరారు
- రూ.43.44 లక్షల సంగతి తేల్చాలని సభ్యుల డిమాండ్
రేగిడి, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): తునివాడలో ఉన్న 39 పొదుపు సంఘాల బ్యాంక్ లింకేజి, స్రీనిధి లెక్కలు తేల్చేందుకు ఒకవైపు యూనియన్ బ్యాంక్ ఉన్నతాధికారులు విచారణ చేపడుతుండగా... మరోవైపు శుక్రవారం డీఆర్డీఏ, వెలుగు అధికారులు రంగంలోకి దిగారు. బ్యాంక్ మిత్ర (సీఎస్పీ) అల్లు శ్రీధర్, ఆయన భార్య వీఏఓ అరుణలు దాదాపు రూ.43.44 లక్షల వరకు పక్కదారి పట్టించినట్లు సంఘాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అధికారుల విచారణ నేపథ్యంలో భార్యాభర్తలిద్దరూ ఊరి నుంచి పరారయ్యారు. నగదు పక్కదారి పట్టడంపై వెలుగు డీపీఎం చిరంజీవి, బ్యాంక్ లింకేజ్ల డీపీఎం లక్ష్ముంనాయుడు, రాజాం క్లస్టర్ స్త్రీనిధి మేనేజర్ వి.సుధాకర్, ఏపీఎం గోవిందరావులు ఎస్హెచ్జీలను బహిరంగంగా విచారణ చేపట్టారు. 2017 నుంచి ఈ సంఘాలకు ఇచ్చిన రుణాలు, చెల్లింపులకు సంబంధించిన రికార్డులను వీరు పరిశీలించారు. అంతర్గత విచారణలో తేలినరూ.43.44 లక్షలు పక్కదారి పట్టిన విషయాన్ని విచారణాధికారి, డీపీఎం చిరంజీవి ధ్రువీకరించారు. ఈ లెక్కలను బ్యాంక్ అధికారులు తేల్చాల్సి ఉంది.
వసూలు చేయించాలి
సంఘాలు క్రమం తప్పకుండా కట్టిన బ్యాంక్ లింకేజీ, స్ర్తీనిధి మొత్తాన్ని సీఎస్పీ శ్రీధర్, ఆయన భార్య అరుణ తినేశారని... ఆ మొత్తాన్ని వసూలు చేయాలని డీఆర్డీఏ అధికారులను స్థానిక ఎస్హెచ్జీ గ్రూపుల మహిళలు డిమాండ్ చేశారు. దీని వెనుక ఎవరు ఉన్నా బయట పెట్టాలని కోరారు. ఎవరెవరు ఎంతెంత చెల్లించిందీ రాతపూర్వకంగా తెలియజేశారు.
బ్యాంక్ సిబ్బంది పాత్రపై అనుమానాలు
ఈ వ్యవహారంలో రేగిడి యునియన్ బ్యాంక్లోని కొంతమంది సిబ్బంది పాత్రపై మహిళా సంఘాల సభ్యులు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. 2018 నుంచి ఇస్తున్న బ్యాంక్ లింకేజీలు, రెండు, మూడేళ్లకొకసారి చేస్తున్న రెన్యువల్ సమయంలో సభ్యులకు రుణాల వివరాలు చెప్పడం లేదని అంటున్నారు. ఈ సంఘాలకు కొత్తగా రుణాలు ఇవ్వడం, సీఎస్పీ, వీఏవోలు దీన్ని ఆసరాగా చేసుకొని డబ్బులు కాజేసినట్లు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని విచారణలో బ్యాంక్ అధికారులకు చెప్పినట్టు తెలిసింది. ఇంత పెద ్ద మొత్తంలో బకారులు కనిపిస్తే సీఎస్పీపై ఎందుకు చర్యలు తీసుకోలేదని వీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.