Development and Welfare అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం
ABN , Publish Date - Jul 02 , 2025 | 11:20 PM
Development and Welfare are the Goals అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు బుధవారం శివరాంపురం గ్రామంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు హారతులిచ్చి ఆమెకు ఘన స్వాగతం పలికారు. ముందుగా మంత్రి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం జోరువానను సైతం లెక్క చేయకుండా ఇంటింటికీ వెళ్లారు.
మంత్రి సంధ్యారాణి
శివరాంపురంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’
ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలపై అవగాహన
ఏడాదిలో చేపట్టిన పనులపై ప్రచారం
ప్రజా సమస్యలపై ఆరా
సాలూరు, జూలై 2(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు బుధవారం శివరాంపురం గ్రామంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు హారతులిచ్చి ఆమెకు ఘన స్వాగతం పలికారు. ముందుగా మంత్రి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం జోరువానను సైతం లెక్క చేయకుండా ఇంటింటికీ వెళ్లారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత గ్రామంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ‘ గత వైసీపీ ప్రభుత్వ తీరుతో నిర్వీర్యమైన అన్ని వ్యవస్థలను ముఖ్యమంత్రి చంద్రబాబు గాడిన పెడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా.. సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తున్నారు. పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తూ.. పరిశ్రమలు స్థాపించేందుకు శ్రమిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టంది. మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేసింది. మారుమూల గ్రామాల్లో రహదారులు, ఇతర మౌలిక వసతులకు పెద్దపీట వేస్తోంది.’ అని తెలిపారు. సర్పంచ్లు పంచాయతీ తీర్మానం ఇవ్వకపోవడం వల్ల శివరాంపురంలో రహదారులు, కాలువల నిర్మాణం జరగలేదన్నారు. ఈ గ్రామంలో వంతెన నిర్మాణానికి తనవంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, సర్పంచ్ గెలుపునకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
తేడా వస్తే సస్పెండే...
శివరాంపురం సచివాలయాన్ని మంత్రి సందర్శించారు. అధికారులతో కాసేపు మాట్లాడారు. వాటర్ ట్యాంకు శుభ్రం చేయకపోవడానికి గల కారణమేమిటని పంచాయతీ కార్యదర్శి రోహిణిని ప్రశ్నించారు. పంచాయతీ నిధులతో వాటర్ ట్యాంకు శుభ్రం చేయాలని, ప్రజలకు సురక్షిత నీటిని అందించాలని సూచించారు. కాలువల్లో పూడికలు తీయించాలన్నారు. వర్షాలు జోరుగా కురుస్తున్నందున వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు అప్రమత్తంగా ఉండాలని తెలిఆపపరు. ప్రజలకు ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించాలని సూచించారు. అంగన్వాడీలు విధులు సక్రమంగా నిర్వహించాలని, లేకుంటే సస్పెండ్ తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్పీభంజ్దేవ్, ఏఎంసీ చైర్మన్ సూర్యనారాయణ, పార్టీ మండల అధ్యక్షుడు పరమేశు, పట్టణ అధ్యక్షుడు తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
సెంటిమెంట్గా అదే గ్రామంలో శ్రీకారం
సాలూరు రూరల్: సాలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకునే అభ్యర్థులు శివరాంపురం నుంచే ప్రచారం ప్రారంభిస్తారు. గతేడాది మార్చి 16న ప్రస్తుత మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సైతం అసెంబ్లీ ఎన్నికలకు ఇక్కడ నుంచే సెంటిమెంట్గా ప్రచార శంఖారావం పూరించారు. తాజాగా ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని కూడా ఆమె అదే గ్రామం నుంచే శ్రీకారం చుట్టారు.