సీఎం దృష్టికి నియోజకవర్గ సమస్యలు
ABN , Publish Date - Oct 29 , 2025 | 12:15 AM
ముఖ్యమంత్రి చంద్రబాబును విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మంగళవారం అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు.
విజయనగరం రూరల్, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబును విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మంగళవారం అమరావతిలో మర్యా దపూర్వకంగా కలిశారు. విజయనగరం నియోజక వర్గం లో నెలకొన్న పలు సమస్యలను ఆయనకు వివరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి సహకరించాలని ఆమె కోరారు.
విజయనగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్), ప్రసూతి, చైల్డ్ ఆసుపత్రి(ఎంసీహెచ్ -ఘోషా)లో ప్రాథమిక మౌలిక సదుపాయాలతో పాటు అవసరమైన సౌకర్యాలను కల్పించి(జీజీహెచ్-రూ 2.92 కోట్లు, ఎంసీహెచ్ ఘోషాకి-2.73 కోట్లు) మొత్తం 5.65 కోట్లు మంజూరు చేయాలని కోరారు.
విజయనగరం శివారు ప్రాంతమైన వేణుగోపాలపురంలో నూతనంగా 220/132/33 కిలో వాట్స్ సబ్ స్టేషన్ను నిర్మించుటకు ప్రభుత్వం మంజూరు చేసిందని, ఈ పనులు వేగవంతంగా జరిగే విధంగా చూడాలని పేర్కొన్నారు.
విజయనగరం నియోజకవర్గ పరిధిలోని నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా గత ప్రభుత్వం భూసేకరణ చేసిందని, భూసేకరణ పరిహారాన్ని రైతులకు అందించాలని కోరారు.
విజయనగరంలోని పెద్ద చెరువు నుంచి పద్మావతి నగర్ వరకూ ప్రధాన కాలువను ఏర్పాటు చేయాలని, ఇందుకు డీపీఆర్ని కూడా ప్రభుత్వానికి నివేదించామని, నగరపాలక సంస్థ దీనిని చేపట్టేందుకు నిధుల సమస్య కారణంగా, వీఎంఆర్డీఏ ద్వారా ఈ డీపీఆర్ ప్రాప్తికి 32 కోట్ల 51 లక్షలు ఇప్పించాలని కోరారు.
ఎస్పీ కార్యాలయం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో వాటి నిర్మాణానికి అవసరమైన నిధులు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ కూడా డీజీపీ కార్యాలయానికి సంబంధిత నివేదికను అందించారని, దీనికి నిధులు కేటాయించాలని కోరారు.