ముగిసిన ఉపాధ్యాయ బదిలీలు
ABN , Publish Date - Jun 15 , 2025 | 11:52 PM
ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ ఆదివారం ముగిసింది. ఉమ్మడి జిల్లాలో 1,514 మంది ఎస్జీటీలకు స్థానచలనం జరిగింది.

- 1,514 మంది ఎస్జీటీలకు స్థానచలనం
సాలూరు రూరల్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ ఆదివారం ముగిసింది. ఉమ్మడి జిల్లాలో 1,514 మంది ఎస్జీటీలకు స్థానచలనం జరిగింది. ఇప్పటికే ప్రధానోపాధ్యాయులు, పీఎస్హెచ్ఎం, పాఠశాల సహాయకుల బదిలీలు, పదోన్నతల ప్రక్రియ పూర్తయ్యింది. ఈ నెల 12 నుంచి వారు విధులకు హాజరవుతున్నారు. అయితే, వెబ్ కౌన్సెలింగ్పై ఎస్జీటీలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో, వారికి ఈ నెల 11 నుంచి మాన్యువల్ పద్ధతిలో కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాలో 2,210 మంది ఎస్జీటీలు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో ఖాళీల దృష్ట్యా తప్పనిసరి బదిలీలు కావాల్సిన వారికి అనుమతించారు. దీంతో 1,514 మంది బదిలీలయ్యారు. ఎస్జీటీల బదిలీ ముగియడంతో వారికి ఆర్డర్స్ జారీ చేస్తున్నారు. సోమవారం వారు కొత్త పాఠశాలల్లో చేరనున్నారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ సజావుగా నిర్వహించడంపై ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు ఏజీఎస్ గణపతి హర్షం వ్యక్తం చేశారు.