Share News

Cell Tower సెల్‌ టవర్ల పనులు వేగవంతం

ABN , Publish Date - Aug 05 , 2025 | 11:47 PM

Cell Tower Works Speeded Up జిల్లాలో సెల్‌ టవర్ల పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. మంగళవారం తన క్యాంప్‌ కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Cell Tower   సెల్‌ టవర్ల పనులు వేగవంతం
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌

పార్వతీపురం, ఆగస్టు 5(ఆంద్రజ్యోతి): జిల్లాలో సెల్‌ టవర్ల పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. మంగళవారం తన క్యాంప్‌ కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘టవర్లు ఏర్పాటు చేయబోయే ప్రాంతాలకు మెటీరియల్‌ తీసుకెళ్లేలా రహదారి సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టాలి. అతి ముఖ్యమైన రహదారి పనులను గుర్తించి నిధులను మంజూరు చేయాలి. అదే విధంగా అటవీ ప్రాంతంలో అనుమతులు కోసం వారంలో ప్రతిపాదనలు పంపాలి.’ అని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సబ్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఎఫ్‌వో ప్రసూన, పంచాయతీరాజ్‌, గిరిజన సంక్షేమశాఖల ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

అక్రమ ప్రైవేట్‌ క్లినిక్‌లపై నిరంతర చర్యలు

ప్రజారోగ్య రక్షణలో భాగంగా జిల్లాలోని అక్రమ ప్రైవేట్‌ మెడికల్‌ క్లినిక్‌లు, ప్రాక్టీషనర్లపై నిరంతరంగా చర్యలు కొనసాగాలని కలెక్టర్‌ ఆదేశించారు. మెడికల్‌ ఆఫీసర్లు, స్టేషన్‌ హౌస్‌ అధికారులు, తహసీల్దార్లతో ఆయన మాట్లాడుతూ.. లైసెన్స్‌ లేకుండా.. నిబంధనలు పాటించ కుండా నడిపే క్లినిక్‌లను వెంటనే సీజ్‌ చేయాలన్నారు. ఫస్ట్‌ ఎయిడ్‌ చికిత్స వరకే పరిమితం చేయాలని సూచించారు. ఎటువంటి ఇంజక్షన్లు కూడా వాడకూడదన్నారు. అనుమతులు లేకుండా క్లినిక్‌లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ అంకితా సురాన, డీఎంహెచ్‌వో భాస్కరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2025 | 11:47 PM