TDP district leaders: కలిసి పనిచేయలే!
ABN , Publish Date - May 09 , 2025 | 11:56 PM
TDP district leaders: జిల్లా టీడీపీలో విభేదాలు పతాక స్థాయిలో ఉన్నాయి. చాలా నియోజకవర్గాల్లో కూటమితో పాటు టీడీపీలో విభేదాలు ఉన్నాయి.

- టీడీపీ జిల్లా నాయకుల్లో విభేదాలు
- మూడు నియోజకవర్గాల్లో పతాకస్థాయికి
- ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలు
- నేడు జిల్లాకు ఇన్చార్జి మంత్రి అనిత రాక
విజయనగరం, మే 9(ఆంధ్రజ్యోతి): జిల్లా టీడీపీలో విభేదాలు పతాక స్థాయిలో ఉన్నాయి. చాలా నియోజకవర్గాల్లో కూటమితో పాటు టీడీపీలో విభేదాలు ఉన్నాయి. పైకి నేతలు కలిసికట్టుగా కనిపిస్తున్నా లోలోపల మాత్రం వర్గాలను నడుపుతున్నారు. ప్రధానంగా నెల్లిమర్ల, ఎస్.కోట, గజపతినగరం నియోజకవర్గాల్లో విభేదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు ముందు వివిధ పార్టీల నుంచి టీడీపీలో చేరిన వారిని పక్కన పెట్టేశారనే భావన వారిలో కనిపిస్తుంది. ప్రాథమిక స్థాయిలోనే వీటిని చల్లార్చకుంటే ఇవి మరింత ముదిరే అవకాశం ఉంది. ఈ తరుణంలో జిల్లా ఇన్చార్జి మంత్రి, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత శనివారం జిల్లాకు రానున్నారు. బొబ్బిలిలో జరిగే టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొనున్నారు. ఈ సమావేశంలో విబేధాలను పక్కన పెట్టి పార్టీని బలోపేతం చేయాలని కేడర్కు ఆమె దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
నెల్లిమర్లలో..
నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి, టీడీపీ ఇన్చార్జి, మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఇటీవల వీరి మధ్య జరిగిన ప్రోటోకాల్ వివాదం ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. ఈ విషయం ఇరు పార్టీల అధినాయకత్వాల దృష్టికి వెళ్లడంతో వారిని పిలిపించి సముదాయించారు. సమన్వ యంతో పనిచేసుకోవాలని సూచించారు. అయినా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉన్నారు. ఇక్కడ టీడీపీ ద్వితీయ శ్రేణి నాయ కులు సైతం వర్గాలుగా చీలిపోయారు. డెంకాడ మాజీ ఎంపీపీ.. బంగార్రాజుతో విభేదించి జనసేన ఎమ్మెల్యే వెంట ఉంటున్నారు. దీంతో ఆ మండలంలో విభేదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల జరిగిన సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను డెంకాడలో వేర్వేరుగా నిర్వహించా రు. మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్ ఎమ్మెల్యే మాధవితో కలిసి నిర్వహించగా, మరికొంత మంది నేతలు కర్రోతు బంగార్రాజుతో కలిసి చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు.
శృంగవరపుకోటలో..
శృంగవరపుకోట నియోజకవర్గంలో టీడీపీలో అంతర్గత విభేదాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి వర్సెస్ గొంప కృష్ణ అన్నట్టు పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో ఎన్ఆర్ఐ గొంప కృష్ణ టిక్కెట్ ఆశించినా దక్కలేదు. టీడీపీ అధిష్ఠానం లలితకుమారికి టిక్కెట్ ఇవ్వడంతో ఆమె గెలిచారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత కృష్ణకు నామినేటెడ్ పదవి ఇచ్చారు. అయితే ఆయన ఎమ్మెల్యేతో కలిసి పనిచేయడం లేదని తెలుస్తోంది. పార్టీలో గుర్తింపు, పదవులు దక్కని చాలామంది గుర్రుగా ఉన్నారు. వారంతా కృష్ణ వైపు టర్న్ అయినట్టు తెలుస్తోంది. నాలుగు మండలాల్లో సైతం అక్కడక్కడా అసంతృప్తులు వినిపిస్తున్నాయి. వీటిని కట్టడి చేయాల్సిన అవసరం అధినాయకత్వంపై ఉంది.
గజపతినగరంలో..
గజపతినగరం నియోజవర్గంలో సైతం పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ నియోజకవర్గానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ద్వితీయ శ్రేణి నేతల మధ్య చీలిక కనిపిస్తోంది. ప్రధానంగా గజపతినగరం మాజీ జడ్పీటీసీ మక్కువ శ్రీధర్, మాజీ ఎంపీపీ శ్రీదేవి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితి ఉంది. పైగా నామినేటెడ్ పోస్టుల్లో సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వలేదన్న అలకలు ఉన్నాయి. వీటిని నియంత్రించకపోతే మాత్రం కష్టమే.