can't work in Bhogapuram! భోగాపురంలో పనిచేయలేం!
ABN , Publish Date - Sep 25 , 2025 | 12:06 AM
can't work in Bhogapuram! ఒకప్పుడు భోగాపురం మండలానికి రావడానికి ఉద్యోగులు పోటీ పడేవారు. ఉద్యోగులకు కొంత స్వేచ్ఛ లభించేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కూటమి ప్రజాప్రతినిధులు, నాయకుల మధ్య విభేదాలతో అధికారులు నలిగిపోతున్నారు. ఎవరి మాట వినాలో.. వినకూడదో దిక్కుతోచనిస్థితిలో ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో వచ్చిన కొద్దిరోజులకే బదిలీ చేయించుకోవడమో.. సెలవు పెట్టి వెళ్లిపోవడమో చేస్తున్నారు.
భోగాపురంలో పనిచేయలేం!
ఆందోళన చెందుతున్న ఉద్యోగులు
రాజకీయ ఒత్తిళ్లతో సతమతం
బదిలీల కోసం ప్రయత్నాలు
భోగాపురం, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు భోగాపురం మండలానికి రావడానికి ఉద్యోగులు పోటీ పడేవారు. ఉద్యోగులకు కొంత స్వేచ్ఛ లభించేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కూటమి ప్రజాప్రతినిధులు, నాయకుల మధ్య విభేదాలతో అధికారులు నలిగిపోతున్నారు. ఎవరి మాట వినాలో.. వినకూడదో దిక్కుతోచనిస్థితిలో ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో వచ్చిన కొద్దిరోజులకే బదిలీ చేయించుకోవడమో.. సెలవు పెట్టి వెళ్లిపోవడమో చేస్తున్నారు. ఇక్కడ జనసేన ఎమ్మెల్యే నాగమాధవి, టీడీపీ నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి. తరచూ బహిరంగంగానే ఇరుపార్టీల కార్యకర్తలు విమర్శలు గుప్పించుకుంటూ ఉంటారు. పనులు, ప్రజా సమస్యలపై అధికారులపై ఇరుపార్టీల నేతలు ఒత్తిళ్లు తెస్తుంటారు. దీంతో అధికారులు తీవ్రమైన ఒత్తిడిక లోనవుతున్నారు. ఇటీవల ఇద్దరు ఎంపీడీవోలు కొన్ని నెలలు మాత్రమే పనిచేసి వెళ్లిపోయారు. దీన్నిబట్టి ఇక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల తరువాత విధుల్లో చేరిన ఎంపీడీవో కిషోర్కుమార్ కొన్ని నెలలు మాత్రమే పనిచేశారు. ఒత్తిడి తట్టుకోలేక లాంగ్ లీవ్ పెట్టి తప్పుకున్నారు. అనంతరం ఇక్కడ ఈవో పీఆర్డీగా విధులు నిర్వహిస్తున్న మహిళకు ఇన్చార్జి ఎంపీడీవోగా బాధ్యతలు అప్పగించారు. ఈమె విధుల్లో ఉన్నప్పుడు అభివృద్ధి తీర్మానాలు, ఉపాధి హామీ పథకం క్షేత్రసహాయల సమస్య లపై రాజకీయ ఒత్తిడి పెరిగింది. దీంతో ఆమె కూడా సెలవు పెట్టి వెళ్లి పోవడానికి ప్రయత్నాలు చేశారు. అయితే ఇన్చార్జి ఎంపీడీవో సెలవుపెడితే తనకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తారేమోనని ముందస్తు ఆలోచనతో ఏవోగా ఉన్న అధికారి సెలవు పెట్టి వెళ్లిపోయారు. ఇటీవల స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ముంజేరు గ్రామానికి చెందిన సర్పంచ్ పూడి నూకరాజు ఇంటి పన్ను బకాయి చెల్లించలేదంటూ ఎమ్మెల్యే నాగమాధవిని ప్రశ్నించారు. ఆ సమయంలో ఎమ్మెల్యే, సర్పంచ్ మధ్య జరిగిన మాటల అంశం జిల్లా అంతా హాట్టాపిక్గా మారింది. రెండు రోజుల క్రితం మండలపరిషత్ కార్యాలయంలో కలెక్టర్ నిర్వహిస్తున్న ఈసీకి సంబంధించి ఎంపీడీవో గాయత్రి, కార్యదర్శులు హాజరవగా.. అక్కడకు ఎమ్మెల్యే నాగమాధవి భర్త లోకం ప్రసాదు వచ్చారు. పంచాయతీల్లో ఏం జరుగుతోందంటూ కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పంచాయతీల్లో ఏపని చేసినా చెప్పడంలేదంటూ ఆవేశంగా మాట్లాడారు. దీంతో కార్యదర్శులు తీవ్ర అసంతృప్తికి లోనై కొంత మంది కన్నీరు పెట్టుకున్నారు. దీంతో ఒత్తిడి తట్టుకోలేని ఇన్చార్జి ఎంపీడీవో గాయిత్రి మరుసటి రోజు నుంచి లాంగ్లీవ్పై వెళ్లిపోయారు. అలాగే కార్యదర్శులు కూడా రాజకీయ వత్తిళ్లు తట్టుకోలేక సెలవు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. తహసీల్దార్ కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్నారని తెలిసింది. రెవెన్యూ కార్యాలయ సిబ్బంది సైతం బదిలీ ఎంత వేగంగా అవుతుందానని ఎదురుచూస్తున్నారు.
------------------------